పంజాబ్‌లో తగ్గిన విద్యుత్‌ చార్జీలు | Power tariff cut by Rs 3 per unit in Punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో తగ్గిన విద్యుత్‌ చార్జీలు

Nov 2 2021 5:52 AM | Updated on Nov 2 2021 5:52 AM

Power tariff cut by Rs 3 per unit in Punjab - Sakshi

చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌లో విద్యుత్‌ చార్జీలను తగ్గించింది. గృహ వినియోగదారులకు ఇచ్చే కరెంట్‌ను ఒక్కో యూనిట్‌కు రూ.3 తగ్గిస్తున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. చార్జీలు తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.3,316 కోట్ల ఆర్థికభారం పడనుంది. చార్జీల తగ్గింపుతో రాష్ట్రంలోని 72 లక్షల గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని సీఎం చరణ్‌జీత్‌ చన్నీ చెప్పారు.

100 యూనిట్ల వరకు ఉన్న పవర్‌ టారీఫ్‌లో ఒక యూనిట్‌కు ఇప్పటిదాకా రూ.4.19 చార్జీ ఉండగా అది ఇకపై రూ.1.19గా ఉండనుంది. దీంతో ప్రతీ యూనిట్‌పై గృహ వినియోగదారులకు రూ.3 లబ్ధి చేకూరుతుంది. 101–300 యూనిట్ల టారిఫ్‌లో ఒక్కో యూనిట్‌కు రూ.4.01 వసూలు చేయనున్నారు. 300 యూనిట్లు మించితే ఒక్కో యూనిట్‌కు రూ.5.76 చెల్లించాల్సి ఉంటుంది. పంజాబ్‌లో విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని కాంగ్రెస్‌ నేత నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ రాష్ట్రంలో సొంత కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనే నిరసన జెండా ఎగరేసిన సంగతి తెల్సిందే. తాజా నిర్ణయంపై సిద్ధూ స్పందించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement