బెంగళూరు: పోలీసు శాఖలోని ఎస్డీఆర్ఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేసే శ్రీశైల్ చౌగలే (37) ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి సిటీలో జరిగింది. బుధవారం రాత్రి విధులు ముగించుకుని చెన్నమ్మ నగరలోని ఇంటికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. భార్య చూసి వెంటనే ఆయన పనిచేసే ఆఫీసుకు కాల్ చేసి చెప్పింది. సిబ్బంది, పోలీసులు చేరుకుని తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లారు. మృతదేహాన్ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాలు బహిర్గతం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
త్వరలో డీఎస్పీ ప్రమోషన్
ఆయన బంధువులు మాట్లాడుతూ చౌగలే ప్రతిభావంతుడైన అధికారి అని, గతంలో రిజర్వు పోలీసు సీఐగా ఉండేవాడని తెలిపారు. త్వరలోనే డీఎస్పీగా ప్రమోషన్ వస్తుందని చెప్పేవాడని, ఇంతలోనే ఘోరం జరిగిందని విలపించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


