క్రీడాకారుల జుగల్‌బందీ  | PM Narendra Modo address in the 134th Episode of Mann Ki Baat | Sakshi
Sakshi News home page

క్రీడాకారుల జుగల్‌బందీ 

Jun 1 2026 5:25 AM | Updated on Jun 1 2026 5:25 AM

PM Narendra Modo address in the 134th Episode of Mann Ki Baat

అథ్లెటిక్స్‌లో వరుస రికార్డులతో దేశ కీర్తిని పెంచారు

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని ప్రశంస

సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో ప్రతిభా పాటవాలు చాటుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అథ్లెటిక్స్‌ రంగంలో దేశ క్రీడాకారులు సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఆదివారం 134వ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ఆయన రేడియోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారుల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. 

ముఖ్యంగా జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ పోటీల్లో నాలుగు కొత్త జాతీయ రికార్డులు నెలకొల్పిన క్రీడాకారులపై ప్రశంసల వర్షం కురిపించారు. గురీందర్‌వీర్‌ సింగ్, విశాల్‌ టీకే, తేజస్విన్‌ శంకర్, దేవ్‌ మీనా, కులదీప్‌ కుమార్‌... ఈ స్నేహితులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులు నెలకొల్పారని చెప్పారు. ముఖ్యంగా 100 మీటర్ల పరుగు పందెంలో రెండు రోజుల వ్యవధిలో పాత రికార్డులను మూడుసార్లు బద్ధలుకొట్టిన అనిమేశ్‌ కుజూర్, గురిందర్‌వీర్‌ సింగ్‌లతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వీరిద్దరి పోటీని క్రీడల్లో ‘జుగల్‌బందీ’గా అభివర్ణించారు. 

భారతీయుల శరీరాకృతి స్ప్రింటింగ్‌కు పనికిరాదనే అపోహలను పటాపంచలు చేస్తూ 10.1 సెకన్లలోపు పరుగు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన నావికాదళ అధికారి గురిందర్‌వీర్‌ను, ఫుట్‌బాల్‌ నుంచి అథ్లెటిక్స్‌లోకి వచ్చి రాణిస్తున్న అనిమేశ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. మైదానం బయట స్నేహితులుగా, మైదానంలో పోటీదారులుగా ఉంటూ దేశ గౌరవాన్ని పెంచుతున్న వీరి క్రీడాస్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే...  

దేశీయ పానీయాలను ఆస్వాదించండి  
‘‘దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండల్లో డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగినంత నీరు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం జారీ చేసే సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వేసవి వేడిని తట్టుకునే అద్భుతమైన మార్గాలు మన వంటగదిలోనే ఉన్నాయి. ఉత్తర భారతదేశపు ఆమ్‌ పన్నా, పంజాబీ లస్సీ, రాజస్తానీ–గుజరాతీ మజ్జిగలతో పాటు బిహార్, జార్ఖండ్‌ల సత్తు షర్బత్, కొంకణ్‌ కోకుమ్‌ షర్బత్, దక్షిణ భారతదేశపు పానకం, నీర్‌ మోర్‌ వంటి సాంప్రదాయ పానీయాలు కేవలం దాహాన్ని తీర్చేవి మాత్రమే కావి.. అవి ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ దేశీయ పానీయాలను ఆస్వాదించాలి. 

గ్లోబల్‌ మార్కెట్‌కు మన మామిడి  
వేసవిలో వచ్చే ఫలరాజం మామిడి పండ్ల ప్రస్తావన రాని ఇల్లు ఉండదు. అల్ఫాన్నో, కేసర్, దశేరీ, లంగ్రా, చౌసా, మాల్డా వంటి మామిడి రకాలు మనకు ఉన్నాయి. ప్రతి పేరుతో ప్రజలకు ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి వెళితే బంగినపల్లి, తోతాపురీ, నీలం, మాల్గోవా, సువర్ణరేఖ వంటి రకాలు కనిపిస్తాయి. ప్రదేశం మారితే మామిడి పండు ఆకారం, రంగు, రుచీ మారుతాయి. మన మామిడి ప్రయాణం ఇప్పుడు గ్రామాల నుండి గ్లోబల్‌ మార్కెట్‌కు చేరుకుంటోంది.  పడవ ప్రమాదంలో విద్యార్థులు చనిపోయిన ఘటనతో కలత చెంది, కేరళంలో ఉచితంగా 15 వేల మందికి పైగా ఈత నేర్పించిన సాజీ వలాశేరిల్‌ సేవలు నిజంగా ప్రశంసనీయం. దివ్యాంగ పిల్లలకూ ఈత నేర్పించారు. యూపీ కాలువలో చిక్కుకున్న గంగా డాలి్ఫన్‌ను 13 గంటల పాటు శ్రమించి కాపాడి రాప్తి నదిలోకి విడిచిపెట్టిన సిబ్బందిని అభినందిస్తున్నా.  

గిరిజా అమ్మ దేశభక్తికి సలాం  
తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కు చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు గిరిజా అమ్మ గొప్ప దేశభక్తికి ప్రతీక. ‘మన్‌ కీ బాత్‌’ స్ఫూర్తితో ఆమె పనిచేశారు. సైనికుల కోసం రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 విరాళం ఇచ్చేలా తన పరిధిలోని 15 పాఠశాలల విద్యార్థులను ఆమె ప్రోత్సహించారు. అలా సేకరించిన రూ.40 లక్షల చెక్కును ఆమె నాకు అందజేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో మనోరమ నదిని శుభ్రం చేసిన యువకుడు ఆకాశ్‌ గుప్తా, గోవాలో పైప్‌లైన్లు వేసి నీటి సమస్యను పరిష్కరించిన తీర్చిన రిటైర్డ్‌ టీచర్‌ బాలకృష్ణ అయ్యర్‌ సేవలు అభినందనీయం’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement