
మ్యూజియం మూడో శతాబ్దం నాటి పాలరాతి బుద్ధుని ప్రతిమ
పల్నాడు జిల్లాలో మొదటగా బుద్ధుని అవశేషాలు కనుగొన్నారు
ఆదివాసీ విద్యార్థుల సూర్య నమస్కారాలు భేష్
123వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ/విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక బౌద్ధ కేంద్రమైన నాగార్జునకొండలోని భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కలి్పంచినందుకు వియత్నాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సందేశాల ద్వారా కృతజ్ఞతలు చెబుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మొదట భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలు రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నాగార్జున కొండలో కనుగొన్నట్టు తెలిపారు.
ఈ ప్రదేశానికి బౌద్ధ మతంతో లోతైన సంబంధం ఉందన్నారు. ఒకప్పుడు శ్రీలంక, చైనా వంటి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి సందర్శించే వారని మోదీ వివరించారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్లో మోదీ ప్రసంగించారు. వియత్నాం ప్రజలు పంపించిన సందేశాలలో ప్రతి పంక్తిలో భక్తి, ఆప్యాయత ఉన్నాయన్నారు. బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించినందుకు వారు భారతదేశానికి తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
ఆదివాసీ విద్యార్థులు భేష్
‘పదేళ్ల క్రితం ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం గొప్పగా మారుతోంది. విశాఖపట్నంలో జరిగిన యోగా దినోత్సవంలో చాలా ఆకర్షణీయమైన చిత్రాలను మనం చూశాం. బీచ్లో 3 లక్షల మంది యోగా చేయడం.. యోగాపై వారికున్న అంకితభావాన్ని గుర్తు చేస్తోంది’ అని మన్ కీ బాత్లో మోదీ గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం జ్ఞాపకాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘విశాఖ నుంచే మరో అద్భుతమైన దృశ్యం వెలువడింది. రెండు వేలకు పైగా ఆదివాసీ విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు. వారికి యోగాపై ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉందో మీరే ఊహించుకోండి. మన నావికాదళ నౌకలపై కూడా యోగా గొప్పతనం కనిపించింది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.