
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరం, మణిపూర్లను సందర్శించే అవకాశం ఉంది. మిజోరం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాని తన పర్యటనను మిజోరంలో ప్రారంభిస్తారు. అక్కడ ఆయన 51.38 కి.మీ. పొడవైన బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ను ప్రారంభించనున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కేంద్రం చేపట్టిన యాక్ట్ ఈస్ట్ పాలసీలో కీలక అడుగు. ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీని బలోపేతం చేయడం, ఆర్థిక వృద్ధిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం దీనిని చేపట్టింది. ఈ రైల్వే లైన్ ఐజ్వాల్ను అస్సాంలోని సిల్చార్ ద్వారా దేశంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతుంది.
మిజోరం పర్యటన అనంతరం ప్రధాని మోదీ మణిపూర్కు విమానంలో వెళ్లే అవకాశం ఉంది. 2023 మేలో జాతి హింస చెలరేగిన తర్వాత ప్రధాని రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి అవుతుంది. ప్రధాని పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయని మిజోరం అధికారులు చెబుతున్నప్పటికీ, ఇంఫాల్లోని అధికారులు మోదీ పర్యటన ఇంకా ధృవీకరణ కాలేదన్నారు. కాగా మిజోరం ప్రధాన కార్యదర్శి ఖిల్లీ రామ్ మీనా ప్రధాని రాక సందర్భంగా వివిధ విభాగాలు, చట్ట అమలు సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మణిపూర్లో జాతి హింస
జాతి ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మణిపూర్ పర్యటన ఆసక్తికరంగా మారింది. మే 2023 నుండి రాష్ట్రంలో మెయిటీ, కుకి-జో వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అశాంతియుత వాతావరణంలో 60 మంది ప్రాణాలను కోల్పోయారు. ఆస్తి విధ్వంసం జరిగింది. వేలాది మంది వలసబాట పట్టారు. మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9న రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. 2027 వరకు పదవీకాలం ఉన్న రాష్ట్ర అసెంబ్లీని తాత్కాలికంగా నిలిపివేశారు.