అక్కడే ఆరంభం.. రేపు మరో అద్భుతం ఆవిష్కృతం! | PM Modi Inaugurate India 1st Underwater Metro In Kolkata Details | Sakshi
Sakshi News home page

అక్కడే మెట్రో ఆరంభం.. రేపు మరో అద్భుతం ఆవిష్కృతం!

Mar 5 2024 7:43 PM | Updated on Mar 5 2024 8:28 PM

PM Modi Inaugurate India 1st Underwater Metro In Kolkata Details - Sakshi

దేశంలో ఆ పరుగులు మొదలైంది అక్కడే. అలాగే.. ఇప్పుడు అక్కడే అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది!.. 

ఢిల్లీ: దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి కోల్‌కతా(పశ్చిమ బెంగాల్‌) మెట్రో వేదిక కానుంది. బుధవారం పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గం మెట్రో సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మరి దీని ప్రత్యేకలు ఓసారి చూద్దాం.. 

ఈస్ట్‌వెస్ట్‌ మెట్రో కారిడార్‌లో..  హౌరా మైదాన్‌ నుంచి ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య ఈ రివర్‌ అండర్‌ గ్రౌండ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మూడు స్టేషన్లు ఉన్నాయి. హౌరా మైదాన్, హౌరా స్టేషన్‌ కాంప్లెక్స్, బీబీడీ బాగ్‌ (మహాకరణ్‌).  హూగ్లీ నదీ కింద భాగంలో కోల్‌కతా నుంచి నదీకి అవతలివైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్‌గ్రౌండ్‌ ప్రయాణం సాగనుంది. నీటి ఉపరితలం నుంచి 32 మీటర్ల లోతున మెట్రో టన్నెల్‌  ఏర్పాటు చేయగా.. ప్రయాణానికి 45 సెకన్ల టైం పట్టనుంది. 

ఈ ఫీట్‌ను మోడ్రన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా కోల్‌కతా మెట్రో అధికారులు అభివర్ణిస్తున్నారు. ఏడు నెలలపాటు ట్రయల్‌ రన్స్‌ జరిపారు. ఇప్పుడు రెగ్యులర్‌ ప్రయాణాలకు అనుమతికి రెడీ చేశారు. 

  • ఈస్ట్‌వెస్ట్‌ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లో పునాది పడింది.  అండర్‌ వాటర్‌ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు.

  • తాజా అండర్‌ గ్రౌండ్‌ ప్రాజెక్టుతో.. రోజూ ఈ మార్గంలో ఏడు లక్షల మంది ప్రయాణిస్తారని కోల్‌కతా మెట్రో రైల్‌ సీపీఆర్వో అంచనా వేస్తున్నారు
  • ప్రధాని మోదీ మార్చి 6న మెట్రో సర్వీసులను ప్రారంభించగా.. మరుసటి రోజునుంచి ప్రయాణికులను అనుమతిస్తారు
  • ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లకు పైనే పట్టింది. టన్నెల్‌ నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల్లోని నివాసాలు దెబ్బ తినగా.. అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు.. స్థానికులను ఒప్పించి, పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేసింది మెట్రో రైల్‌ కోల్‌కతా.
  • హౌరా మెట్రో స్టేషన్.. నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. తద్వారా భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కనుంది. 
  • దేశంలో తొలిసారి 1984 అక్టోబర్‌ 24వ తేదీన కోల్‌కతాలోనే మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. సుమారు 3.4 కిలోమీటర్ల దూరంలో ఐదు స్టేషన్లతో తొలి మెట్రో పరుగులు తీసింది నాడు. అదే నగరంలో ఇప్పుడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. 
  • కోల్‌కతా ఈస్ట్వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. దీంట్లో 10.8 కి.మీ.లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో కొంతభాగం హుగ్లీ నది కింద సొరంగంలో ఉండగా.. మిగిలినదంతా  భూ ఉపరితలంపైనే.
  • సొరంగం లోపల అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. 
  • లండన్‌ప్యారిస్‌ కారిడార్‌లోని యూరోస్టార్‌ సర్వీసు మాదిరిగా రూపొందించిన సొరంగమార్గం ఇది.
  • ఈ తరహా మెట్రో రూట్‌ ద్వారా.. నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించినట్లు అవుతుందని మెట్రో అధికారులు అంటున్నారు. 



 

Advertisement
 
Advertisement
Advertisement