
రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్రంలో 11 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో ప్రచారం తప్ప పారదర్శకత ఏమాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ సర్కారు వర్తమానం గురించి మాట్లాడడం మానేసి, 2047కు సంబంధించిన కలల్లో విహరిస్తోందని తప్పుపట్టారు. ప్రజలను భ్రమల్లో ముంచేస్తూ కాలం గడుపుతోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఒకవైపు మోదీ ప్రభుత్వం 11వ వార్షికోత్సవాలు చేసుకుంటున్న సమయంలోనే మరోవైపు ముంబైలో ఘోర ప్రమా దం జరిగిందని పేర్కొన్నారు.
రైలు నుంచి కిందపడి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యం కోట్లాది మంది ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే రైల్వేశాఖ నేడు అభద్రత, గందరగోళం, విపరీతమైన రద్దీకి మారుపేరుగా మారిందని ఆక్షేపించారు. దేశంలో వాస్తవిక పరిస్థితికి ఈ ఘటన అద్దంపడుతోందన్నారు. మోదీ ప్రభుత్వం ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. 11 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో వచ్చిన మార్పేమీ లేదని విమర్శించారు. 2047 నాటి కలలు విక్రయించడం ఆపేసి, 2025 గురించి మాట్లాడాలని ప్రభుత్వానికి హితవు పలికారు.