ఆర్మీ అధికారి కాబోయే భార్యపై పోలీసుల వేధింపులు | Odisha Army officer fiance Assaulting By Police | Sakshi
Sakshi News home page

ఆర్మీ అధికారి కాబోయే భార్యపై పోలీసుల వేధింపులు

Sep 20 2024 11:47 AM | Updated on Sep 20 2024 11:59 AM

 Odisha Army officer fiance Assaulting By Police

భువనేశ్వర్: భారత ఆర్మీకి చెందిన అధికారికి కాబోయే భార్యపై పోలీసుల దాడి ఘటన ఒడిషాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అలాగే, జాతీయ మహిళా కమిషన్‌ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

వివరాల ప్రకారం.. గత ఆదివారం రాత్రి బాధితురాలు తన రెస్టారెంట్‌ను మూసివేసి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో కొంత మంది ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ఆమెను వేధింపులకు గురిచేశారు. దాడి చేసే ప్రయత్నం చేశారు. అనంతరం, ఈ దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆమె  భరత్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ వెళ్లారు. ఈ సందర్బంగా పీఎస్‌ కేవలం ఒక్క మహిళా కానిస్టేబుల్‌ మాత్రమే సివిల్‌ డ్రెస్‌లో ఉన్నారు. జరిగిన విషయం చెప్పి కేసు నమోదు చేయాలని కోరగా అందుకు కానిస్టేబుల్‌ నిరాకరించింది. కాసేపటి తర్వాత కొందరు పోలీసులు స్టేషన్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా తనపై దాడికి సంబంధించిన ఘటనపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు మహిళా పోలీసులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను లాకప్‌లో వేసి దారుణంగా హింసించారు. ఇన్స్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ ఉన్న పోలీసు, మరో నలుగురు ఆమె వద్దకు వెళ్లి బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. దారుణంగా సైగలు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల దెబ్బల కారణంగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తర్వాత ఆమె ఎయిమ్స్‌ చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ క్రమంలో తనతో పోలీసులు ప్రవర్తించిన తీరును వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు.

ఇక, ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మహిళా పోలీసులతో పాటు, మరో ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. జాతీయ మహిళా కమిషన్‌ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆమెకు కాబోయే భర్త కోల్‌కతాలోని 22 సిక్కు రెజిమెంట్‌లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కోల్‌కతా: సీఎం మమతకు ఊరట.. రేపటి నుంచి విధుల్లోకి జూడాలు

Advertisement
 
Advertisement
Advertisement