బిహార్లో మొత్తం ఐదు సీట్లనూ గెల్చుకున్న ఎన్డీయే
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బిహార్లోని ఐదు, ఒడిశాలో నాలుగు, హరియాణాలో రెండు సీట్లకు సోమవారం జరిగిన పోలింగ్లో బీజేపీ అత్యధిక సీట్లను దక్కించుకుంది. 11 సీట్లకు గాను బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. ఒకటి బీజేడీకి, మరోటి బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థికి దక్కింది.
హరియాణాలో కౌంటింగ్ నిలిచిపోవడంతో ఫలితం వెల్లడి కాలేదు. బిహార్ నుంచి ఖాళీ అవనున్న మొత్తం ఐదు స్థానాలను ఎన్డీయే క్లీన్స్వీప్ చేసింది. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్, నితిన్ నబీన్లతోపాటు జేడీయూ నేత, కేంద్ర మంత్రి రాంనాథ్ ఠాకూర్, బీజేపీ నేత శివేశ్ కుమార్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ఎన్నికయ్యారు.
ఐదు సీట్లకుగాను ఆర్జేడీకి చెందిన అమరేంద్ర ధారి సింగ్ సహా ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, వరుసగా రెండో విడత గెలవాలన్న అమరేంద్రకు మహాగఠ్బంధన్ నుంచి సహకారం కరువైంది. దీంతో, ఆయన ఓడిపోయారు. కాగా, బిహార్కు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నితీశ్ కుమార్ ఇటీవల రాజ్యసభకు వెళ్లనున్నట్లు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పర్చింది. రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే రాజీనామా చేస్తారని భావిస్తున్నారు.
ఒడిశాలో బీజేపీకి రెండు సీట్లు
ఒడిశాలో అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, పార్టీ ఎంపీ సుజీత్ కుమార్ 35 చొప్పున ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అధికార అభ్యర్థి సంతృప్త్ మిశ్రా 31 ఓట్లతో గెలిచారు. బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే కూడా గెలిచారు. తమ 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులకు ఓటేశారని బీజేడీ ఆరోపించింది. కాంగ్రెస్ కూడా తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసినట్లు పేర్కొంది.


