మైసూరు(కర్ణాటక): యువకున్ని కిడ్నాప్ చేసి బలవంతంగా మంగళముఖిగా వేషం వేసి డబ్బులు వసూలు చేయించడం, రీల్స్ చేయించుకుని డబ్బు సంపాదిస్తూ, అతన్ని కూడా బలవంతంగా హిజ్రాగా మార్చాలని ప్రయత్నించారు. దీంతో బాధిత యువకుడు న్యాయం కోసం మైసూరు లష్కర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నంజనగూడులోని త్యాగరాజ కాలనీకి చెందిన యువకుడు అనిల్కుమార్ దివ్యాంగుడు కూడా. అతడు 4 నెలల క్రితం మైసూరు రూరల్ బస్టాండులో బస్సు కోసం వేచిఉన్న సమయంలో మంగళముఖి అనిత ముసుగువేసి.. కిడ్నాప్ చేసి, మంగళూరుకు తీసుకు వెళ్లింది.
అక్షతగా పేరు మార్చి
తరువాత అతనికి చీర , నైటీ, చెవి కమ్మలు వేసి అక్షత అని పేరు మార్చింది. బలంవంతంగా వీధులలో , దుకాణాల వద్ద భిక్షాటన చేయించింది. ప్రతినిత్యం 2 నుంచి 3 వేల రూపాయలు కలెక్షన్ తీసుకు రావాలని బెదిరించింది. రీల్స్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మంగళూరు, కేరళ ప్రాంతాలలో వ్యభిచారానికి పంపింది. అతని ఆధార్ కార్డులో కూడా ట్రాన్స్ జెండర్గా మార్పించింది. వచ్చే నెల ముంబైకి తీసుకు వెళ్లి, సర్జరీ చేయించి పూర్తిగా మంగళముఖిగా మార్చడానికి ప్రణాళిక రూపొందించింది. దీనిని గుర్తించిన అనిల్కుమార్ ఇంటికి వెళ్తానని చెప్పగా, అనిత బెదిరించి చోరీ కేసు పెట్టించింది. ఎలాగోలా మంగళూరు నుంచి తప్పించుకుని వచ్చిన అనిల్.. మైసూరు లష్కర్ స్టేషన్లో అనితపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన ఫిర్యాదుకు స్పందించడం లేదని అనిల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


