
భారతావనిలో ‘ఉష్ణ’ తాండవం
దేశమంతటా వడగాడ్పులు, ఉక్కపోత
2030 నాటికి రెట్టింపు వడగాడ్పు రోజులు
ఈ జాబితాలో హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాలు
కోస్తా జిల్లాలపైనా తీవ్ర వేడిమి ప్రభావం
దేశ ఆర్థిక వ్యవస్థకు అపార నష్టం
ఐపీఈ గ్లోబల్, ఎస్రి ఇండియా నివేదిక
జూన్ 14 వరకు తీవ్రమైన వడగాడ్పులు.. వాయవ్య భారతానికి వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక.పంజాబ్, హరియాణాలకు రెడ్ అలర్డ్. వచ్చే 48 గంటల్లో భానుడి ఉగ్రరూపం అంటూ జూన్ 12న ఐఎండీ మరో హెచ్చరిక.వేసవి వెళ్లిపోయింది. ఉష్ణోగ్రత ఉండిపోయింది! దేశంలోని అన్ని ప్రాంతాలను వడగాడ్పులు చుట్టు ముట్టాయి. ఇది ప్రస్తుతం.– సాక్షి, స్పెషల్ డెస్క్
2030 నాటికి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, వంటి నగరాల్లో వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య ఇప్పటితో పోలిస్తే రెట్టింపు కానుందట. టైర్ –1, 2 సిటీల్లో 72 శాతం వాటికి తీవ్ర వేడిమి, భారీ వర్షాల ముప్పు పొంచి ఉందట. ఐపీఈ గ్లోబల్ – ఎస్రి ఇండియా సంయుక్త అధ్యయనం ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
భానుడి ప్రతాపానికి పంజాబ్, హరియాణా, రాజస్తాన్ తల్లడిల్లిపోతున్నాయి. ఢిల్లీలో రెడ్ అలెర్ట్. స్కూళ్లు బంద్. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఏప్రిల్ మధ్య నుండి జూన్ 10 వరకు దాదాపు 700 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ చరిత్రలోనే ‘హాటెస్ట్ ఇయర్’గా 2024 నమోదైంది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో భారత్లో సెగలు రేగుతున్నాయి.
భవిష్యత్తుల్లో వేసవి కాలం.. మరిన్ని రోజులు ఉండనుందట. వడగాడ్పుల తీవ్రత మరింత పెరగనుందట. ఒకపక్క భారీ వర్షాలు.. మరోపక్క పిడుగుల వర్షం కురవనుంది. మానవాభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాల్లో పనిచేసే ఐపీఈ గ్లోబల్; భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)పై పనిచేసే ఎస్రి ఇండియా సంయుక్తంగా దేశంలో తీవ్ర వేడి, అత్యంత వర్షపాతం అంశాలపై అధ్యయనం చేశాయి. జిల్లా స్థాయిలో సమస్య తీవ్రతను మ్యాపింగ్ చేశాయి. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ప్రజారోగ్య వ్యవస్థలను పర్యావరణ ఉత్పాతాలను తట్టుకునేలా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.
పదింట 8 జిల్లాల్లో...
1993 నుంచి చూస్తే.. వేసవిలో తీవ్రమైన వడగాడ్పులు ఉండే రోజులు 15 రెట్లు పెరిగాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన వేడి, భారీ వర్షాలు.. ఇలా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2040 నాటికి.. ప్రతి 10 కోస్తా జిల్లాల్లోనూ 8 జిల్లాల్లో వేసవి ముగిసినా తీవ్ర వేడి, ఉక్కపోత వంటివి వర్షాకాలంలో కూడా నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సమస్యలకు పరిష్కారంగా.. రియల్టైమ్లో వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఒక క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ (సీఆర్ఓ) ఏర్పాటును ఈ అధ్యయనం సూచించింది.
జీడీపీలో 4.5 శాతం తగ్గుదల
ఎండ దెబ్బకు ఆర్థిక నష్టం కూడా పెరిగే ముప్పు పొంచి ఉంది. 2030 నాటికి భారతదేశం అంచనా వేసుకున్న 8 కోట్ల ప్రపంచ ఉద్యోగాలలో 3 కోట్ల 40 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. తీవ్రమైన వేడి, ఉక్కపోత కారణంగా పని గంటల్ని కోల్పోయే పరిస్థితి ఉండటంతో ఈ దశాబ్దంలో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో 4.5 శాతం వరకు తగ్గుదల కనిపించవచ్చని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది.
తీవ్రం.. సాధారణం!
తీవ్రమైన వాతావరణం అన్నది ఇప్పుడు చాలా సాధారణమైన విషయమైపోయింది. దీన్ని కనిపెట్టి, మార్చుకోవాలంటే మనకు భౌగోళిక ఉపకరణాలు చాలా అవసరం. – అజేంద్రకుమార్, ఎమ్.డి., ఎస్రి
వాతావరణ అస్థిరతలు పసిగట్టాలి
వాతావరణం, అభివృద్ధి అనేవి పరస్పర అవినాభావ సంబంధం ఉన్నవి. భారత్ సహా గ్లోబల్ సౌత్గా పిలిచే దేశాలన్నింటి ముందూ ఇప్పుడు ఒక సమస్య ఉంది. అదేంటంటే.. వాతావరణ అస్థిరతలను పసిగట్టి, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతూనే ప్రజల జీవన ప్రమాణాలనూ పెంచాలి. – అశ్వజిత్ సింగ్, వ్యవస్థాపకుడు, ఎమ్.డి., ఐపీఈ గ్లోబల్
కోస్తా ప్రాంతాల్లోనే ఎక్కువ
భారతదేశం అంతటా వడగాడ్పులు వీచే రోజులు 2030, 2040 నాటికి గణనీయంగా పెరుగుతాయని అంచనా. ప్రాంతాల వారీగా వడగాడ్పు రోజుల సంఖ్యలో పెరుగుదల అంచనాలు..
