సాక్షి, బళ్లారి, రాయచూరు రూరల్: బంధువుకు అనారోగ్యంగా ఉండడంతో ఉదయమే ఊరి నుంచి మరో ఊరికి వచ్చారు. అర్ధరాత్రి తిరిగి బయల్దేరారు. కొంతసేపు ఉంటే క్షేమంగా చేరేవారే. కానీ మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చి పొట్టనబెట్టుకుంది. ట్రాక్స్ క్రూయిజర్ను లారీ ఢీకొగా, 5 మంది క్షణాల్లోనే చనిపోయారు. కలబుర్గి జిల్లా చిత్తాపూర్ తాలూకా లాడ్లాపూర్ సమీపంలో జాతీయ రహదారి– 50 పై జరిగింది.
తుక్కయిన క్రూయిజర్
చిత్తాపూర్ తాలూకా వాడి పట్టణం దగ్గర ఇంగళిగి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 మంది క్రూయిజర్లో యాదగిరికి వచ్చి శుక్రవారం అర్ధరాత్రి తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన తమిళనాడు లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఆ ధాటికి క్రూయిజర్ గుర్తుపట్టలేనంతగా తుక్కయింది. అందులోని మహ్మద్ హుస్సేన్ (60), ఫాతిమా (40), రసూల్బీ (40), మహబూబ్ (34), టోలూసాబ్ కాశ్వర్ (27) అనే అందరూ మరణించారు. మృతదేహాలు వాహనంలో చిక్కుకుపోయాయి. ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, స్థానికులతో కలిసి బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవరు కోసం గాలిస్తున్నారు. ఐదుమంది మరణంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.


