మధుబని: ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున బిహార్లోని మధుబని రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ మూడు వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నిలిపి ఉంచిన జయనగర్-ఉధ్నా అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు, గురువారం బయలుదేరాల్సి ఉంది. షంటింగ్ ప్రక్రియ సమయంలో అకస్మాత్తుగా ఒక బోగీ నుంచి మంటలు రావడం మొదలైంది. చూస్తుండగానే మంటలు తీవ్రరూపం దాల్చడంతో, ఆ బోగీ పూర్తిగా కాలి బూడిదైంది.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని, గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే యంత్రాంగం అప్రమత్తమై ప్లాట్ఫాం ప్రాంతాన్ని ఖాళీ చేయించి, భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
సమస్తిపూర్ డివిజన్ డీఆర్ఎం జ్యోతి ప్రకాష్, కమాండెంట్ ఆశిష్ కుమార్ తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైలు నిలిపి ఉంచిన సమయంలో మంటలు ఎలా వచ్చాయనే కోణంలో రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరిస్తున్నామని, సమగ్ర విచారణ నివేదిక తర్వాతే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు.
#WATCH | Fire broke out in the empty coaches of the Jaynagar–Udhna Antyodaya Express at the Madhubani Railway Station in Bihar. The train was stationary on Platform No. 3 at Madhubani Station, undergoing shunting operations, when the incident occurred. pic.twitter.com/eli4tYMmhF
— ANI (@ANI) May 28, 2026


