సాక్షి, చెన్నై: తమిళనాడులో బల నిరూపణకు ముందు తమిళగ వెట్రి కగళం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ఓటింగ్లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
శ్రీనివాస్ సేతుపతి ఈ ఎన్నికల్లో టీవీకే తరఫున తిరుప్పత్తూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పన్పై ఒక్క ఓటుతో గెలిచారు. కౌంటింగ్ సమయంలో ఆ టైంలో హైడ్రామా నడిచింది. అయితే..
ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. తిరుపత్తూరు నియోజకవర్గం నం.185లో నమోదు కావలసిన ఓటు, పొరపాటున వెల్లూరు జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గం నం.50కి బదిలీ చేయబడిందని.. ఈ విషయంపై తాను ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కరుప్పన్ కోర్టులో వాదించారు.
ఈసీ మాత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఫిర్యాదులపై చర్య అవసరం లేదని పేర్కొంది. అలాగే, ఒక్క పోస్టల్ ఓటు కూడా ఇతర నియోజకవర్గానికి బదిలీ కాలేదని స్పష్టం చేసింది. అయితే..
కోర్టు పెరియా కరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు ఉన్నాయని గమనించింది. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా ఓటు వేయడానికి వీల్లేదని శ్రీనివాస్కు తేల్చి చెప్పింది. అదే సమయంలో.. అన్ని పోస్టల్ బ్యాలెట్లను సురక్షితంగా భద్రపరచాలని, సంబంధిత వీడియో ఫుటేజ్ను కూడా కాపాడాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఓటింగ్కు శ్రీనివాస్ సేతుపతి దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు మ్యాజిక్ ఫిగర్ 118. గవర్నర్కు విజయ్ సమర్పించిన మద్దతుదారు ఎమ్మెల్యేల సంఖ్య 118. ఇందులో టీవీకే 107, కాంగ్రెస్ 5, వీసీకే 2, లెఫ్ట్ పార్టీలు 4 ఉన్నాయి. బల నిరూపణకు ఒక్క ఎమ్మెల్యే దూరం అయితే ఆ ఫిగర్ 117కి పడిపోనుంది. అయితే ఏఎంఎంకే, అన్నాడీఎంకే చీలిక వర్గ ఎమ్మెల్యేల మద్దతు ప్రకటనతో గండం నుంచి విజయ్ గట్టెక్కే చాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.


