ఢిల్లీ: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. నియోజకవర్గాల పెంపుపై ప్రభుత్వం చెబుతున్న విషయాలు లిఖితపూర్వకంగా బిల్లులో పెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా చూడాలని.. అన్ని పార్టీలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని కోరారు. డీలిమిటేషన్ ప్రక్రియ విపక్షాలను అణచివేసేదిగా ఉండకూడదన్నారు.
మహిళా రిజర్వేషన్కు సంపూర్ణ మద్దతిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది. సంక్షేమ పథకాలన్నీటిని మహిళలకు భాగస్వామ్యం కల్పించారు. ఇళ్ల పట్టాలు మహిళల పేర్లతోనే ఇచ్చారు. నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ పట్టుబడ్డారు. అసభ్యకరమైన వీడియోలు బయటపడ్డాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసిన మహిళపైనే కేసులు పెడుతున్నారు. మహిళలను వేధిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. సూత్రప్రాయంగా ఈ బిల్లులను అంగీకరిస్తున్నాము. కానీ, మేము లేవనెత్తిన అన్ని అంశాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి’’ అని మిథున్రెడ్డి పేర్కొన్నారు.


