కేదారనాథ్: ప్రపంచ ప్రసిద్దచెందిన ఉత్తరరాఖండ్లోని కేదారనాథ్ ధామం ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏప్రిల్ 22న ఆలయ ద్వారాలు తెరిచినప్పటి నుండి, భక్తుల రద్దీ ఊహించని రీతిలో పెరిగింది. కేవలం 39 రోజుల్లోనే 10 లక్షల మందికి పైగా భక్తులు బాబా కేదార్నాథ్ను దర్శించుకోవడం మరో చరిత్రకు నాందిపలికింది. గతంతో పోలిస్తే, ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం ఇదే మొదటిసారి.
భక్తి పారవశ్యంలో కేదారపురి
ఆలయ ప్రాంగణం ‘హర్ హర్ మహాదేవ్’ అనే జయఘోషలతో మార్మోగుతోంది. రోజూ సుమారు 25 వేల మందికి పైగా భక్తులు కొండలను అధిరోహిస్తూ ఆలయానికి చేరుకుంటున్నారు. వారాంతాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. గౌరీకుండ్ నుండి కేదారపురి వరకు ఎక్కడ చూసినా భక్తుల అంతులేని క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణం కూడా భక్తుల ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి.
భద్రత కోసం మరింత నిఘా
రుద్రప్రయాగ ఎస్పీ నిహారికా తోమర్ మాట్లాడుతూ, భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పోలీస్, ఎస్డీఆర్ఎఫ్,ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. యాత్ర మార్గంలో అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని హెచ్చరించారు. సిసిటివి కెమెరాలు, సోషల్ మీడియా పర్యవేక్షణతో పాటు, అక్రమ మద్యం వ్యాపారులపై దాడులు చేస్తూ, కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ సీజన్ ముగిసే సమయానికి..
ఈ ఏడాది భక్తుల రాకను బట్టి చూస్తే, ఈ సీజన్ ముగిసే సమయానికి కేదారనాథ్ యాత్ర అన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాబా కేదార్పై భక్తులకు ఉన్న అచంచల విశ్వాసం, యాత్ర నిర్వహణలో మెరుగైన ఏర్పాట్లు ఈ యాత్రను విజయవంతం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: నింగిలో అద్భుతం: నేడు ‘బ్లూ మూన్’ సందడి


