
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విక్టరీ పరేడ్(Bengaluru Stampede Incident) విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. ఇలాంటి వేడుకల విషయంలో ఇక మీదట కఠినంగా వ్యవహరించాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కొత్తగా Crowd control law(CCL) తీసుకురావాలనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించే యోచనలో ఉంది.
బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం "కర్ణాటక క్రౌడ్ కంట్రోల్ బిల్- 2025(Crowd Control Bill 2025) అనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనల కట్టడికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ బిల్లులో ముఖ్యాంశాలు:
- ఈ చట్టాన్ని పాటించకపోయినా.. ఉల్లంఘించినా.. గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది
- రూ. 5,000 నుంచి రూ. 50,000 వరకు జరిమానా ఉంటుంది
- ఈ చట్టం ఉత్సవాలు, జాతరలు, ఊరేగింపులు, మతపరమైన వేడుకలకు వర్తించదు
- అవాంఛనీయ ఘటనలు జరిగితే.. ఈవెంట్ నిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది
- తొక్కిసలాటలు జరిగితే బాధితులకు నిర్వాహకులే నష్టపరిహారం చెల్లించాలి
- చెల్లించకపోతే.. వసూలు చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది
ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు ఇవాళ(జూన్ 19, గురువారం) కేబినెట్ ముందుకు వచ్చింది. రాజకీయ ర్యాలీలు, సభలతో పాటు స్పాన్సర్డ్ ఈవెంట్లను నియంత్రించే చర్యలను ఈ డ్రాఫ్ట్ ప్రస్తావించింది. మతపరమైన ఊరేగింపులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. పోలీసుల అనుమతి తీసుకోకపోయినా.. జనాలను నియంత్రించలేకపోయినా.. ఉల్లంఘన కిందకే వస్తుంది. ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే ఆ నిర్లక్ష్యానికి నిర్వాహకులదే పూర్తి బాధ్యత
నాన్ కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ కేసుగా పరిగణిస్తారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేసును విచారణ జరుపుతారు. వచ్చే భేటీలో కేబినెట్ ఈ బిల్లుకు పచ్చ జెండా ఊపొచ్చనే ప్రచారం ఊపందుకుంది.