యుద్ధానికి సిద్ధపడుతున్నామా?

Kargil Vijay Diwas Special Story In Sakshi Funday

సమీప గతంలో భారత్‌ తలపడిన చివరి యుద్ధం కార్గిల్‌ యుద్ధం. పాకిస్తాన్‌తో జరిగిన ఈ యుద్ధంలో కొన్ని అనివార్య నష్టాల తర్వాత భారత్‌ విజయం సాధించింది. కార్గిల్‌ యుద్ధం ముగిసి నేటికి సరిగ్గా ఇరవైఒక్కేళ్లు పూర్తవుతున్నాయి. ఇటీవలే గాల్వన్‌ లోయ వద్ద చైనా సైనికులు సరిహద్దులు దాటి చొరబడి భారత సైనికులపై దాడికి తెగబడటంతో మళ్లీ యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన మొదలైంది. ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే, అందుకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉండటానికి భారత సైన్యం సమాయత్తమవుతోంది. 

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారత్‌కు పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనాలతో సరిహద్దు వివాదాలకు సంబంధించి పొరపొచ్చాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఇవి యుద్ధాలకు కూడా దారితీశాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్‌తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధాలు జరిగాయి. ఒకవైపు పాకిస్తాన్‌ సరిహద్దుల వద్ద వీలు చిక్కినప్పుడల్లా చొరబాట్లకు తెగబడుతూనే ఉండగా, మరోవైపు ఇటీవల చైనా సైతం దూకుడు పెంచింది. పొరుగు దేశాల తీరు చూస్తే, ఏ నిమిషంలోనైనా యుద్ధం ముంచుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ యుద్ధమే గనుక ముంచుకొస్తే, ఎదుర్కోవడానికి భారత సైన్యం తగిన సన్నాహాలు చేసుకుంటోంది. ‘గాల్వన్‌’ సంఘటన తర్వాత ప్రభుత్వం సైన్యానికి అత్యవసరంగా నిధులు విడుదల చేసింది. ఎక్కడి నుంచైనా రూ.500 కోట్ల వరకు విలువ చేసే ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సైన్యానికి ఆర్థిక అధికారాలు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత సైన్యం అమెరికా నుంచి 72,400 అసాల్ట్‌ రైఫిళ్ల కోసం ఆర్డర్‌ ఇవ్వనుంది. గత ఏడాది మన సైన్యం అమెరికా నుంచి రూ.700 కోట్ల విలువ చేసే ఆయుధాలను కొనుగోలు చేసింది. (విజయ్‌ దివస్‌ 21వ వార్షికోత్సవం)

అమెరికా నుంచి కొత్తగా కొనదలచుకున్న ‘సిగ్‌ సాయెర్‌’ అసాల్ట్‌ రైఫిళ్లు కూడా తమ చేతికి అందితే, భారత సైన్యానికి గల 8 లక్షల రైఫిళ్ల అవసరం పూర్తిగా తీరినట్లే అవుతుందని సైనిక ఉన్నతాధికారి ఒకరు ఇటీవల మీడియాకు వెల్లడించారు. అమేథి సమీపంలోని కోర్వాలో ‘మేకిన్‌ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా నెలకొల్పిన ఆయుధ కర్మాగారం నుంచి ఏకే–203 రైఫిళ్లు సైన్యానికి గల మిగిలిన అవసరాలకు సరిపోతాయని ఆయన వివరించారు. అయితే, వీలైనంత వరకు చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో మరోసారి చైనాతో కమాండర్‌ స్థాయి అధికారుల చర్చలకు భారత సైన్యం సమాయత్తమవుతోంది. ఇప్పటి వరకు మూడుసార్లు ఈ స్థాయి చర్చలు జరిగాయి. దశలవారీగా ద్వైపాక్షిక సైనిక చర్చల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికే భారత్‌ మొగ్గు చూపుతోంది. మరోవైపు పరిస్థితి అదుపు తప్పి, పొరుగు దేశం యుద్ధానికి తెగబడితే, ఎదుర్కోవడానికి కూడా సమాయత్తమవుతోంది. తాజా పరిస్థితులు పొరుగు దేశాల సైనిక బలాబలాలు, భారత్‌ సైనిక బలాబలాలు, ఇదివరకు భారత్‌ ఎదుర్కొన్న యుద్ధాల విశేషాలపై ఒక విహంగ వీక్షణం...
కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా...

‘కార్గిల్‌’లో ఏం జరిగిందంటే...
దేశ విభజన జరిగిన నాటి నుంచే పాకిస్తాన్‌తో సరిహద్దు వివాదం మొదలైంది. దేశ విభజనకు ముందు కార్గిల్‌ లడఖ్‌ తహశీల్‌లో అంతర్భాగంగా ఉండేది. రకరకాల భాషలు, రకరకాల మతాలు, రకరకాల జాతులకు చెందిన ప్రజలు ఇక్కడి లోయ ప్రాంతాల్లో ఉండేవారు. దేశ విభజన జరిగిన కొద్ది నెలల వ్యవధిలోనే పాకిస్తాన్‌ 1947 అక్టోబర్‌ 22న భారత్‌తో యుద్ధానికి తలపడింది. అప్పటికి రాచరికంలో ఉన్న జమ్ము కశ్మీర్‌ ప్రాంతాన్ని చేజిక్కించుకునే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టింది. అప్పటికి జమ్ము కశ్మీర్‌ రాజుగా ఉన్న హరిసింగ్‌ తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేసే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్‌ యుద్ధానికి దిగడంతో రాజా హరిసింగ్‌ భారత్‌ను సైనిక సహాయం కోరారు. సైనిక సహాయానికి ప్రతిగా జమ్ము కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి అంగీకరించారు. అప్పటి పాక్‌ అధినేత జిన్నా ‘పాకిస్తాన్‌కు కశ్మీర్‌ జీవధార’ అని, దానిని ఎలాగైనా దక్కించుకుంటామని భీషణ ప్రతిన చేసి, తన సేనలను యుద్ధం వైపు నడిపినా, యుద్ధం తర్వాత జమ్ము కశ్మీర్‌ భారత్‌లో విలీనమైంది. పాకిస్తాన్‌తో జరిగిన ఆ యుద్ధం 1949 జనవరి 5న ముగిసింది. రాచరిక పాలనలో ఉన్న జమ్ము కశ్మీర్‌ లడఖ్‌ ప్రాంతాలకు చెందిన భూభాగంలో మూడింట రెండొంతుల భూభాగాన్ని భారత్‌ విజయవంతంగా స్వాధీనం చేసుకోగలిగింది.

గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసిన ఈ యుద్ధంలో నిజానికి భారత్‌ విజేతగా నిలిచినట్లు లెక్క. తను చేజిక్కించుకుందామనుకున్న జమ్ము కశ్మీర్‌ ప్రాంతం భారత్‌లో విలీనం కావడం పాకిస్తాన్‌కు ఇప్పటికీ మింగుడు పడని విషయమే. తప్పనిసరి పరిస్థితులు ఎదురైనప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాలను కుదుర్చుకోవడం, ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా ఉల్లంఘనలకు పాల్పడటాన్ని పరిపాటిగా మార్చుకుంది. చిన్నా చితకా చొరబాట్ల తర్వాత 1965లో మరోసారి యుద్ధానికి తలపడింది. అమెరికా, రష్యాలు జోక్యం చేసుకోవడంతో మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత 1966 జనవరి 10న ‘తాష్కెంట్‌ ఒడంబడిక’పై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేయడంతో అప్పటికి పరిస్థితి సద్దుమణిగింది. 

ఆ తర్వాత భారత్‌–పాక్‌ల మధ్య 1971లో బంగ్లా విమోచన యుద్ధం జరిగింది. దేశ విభజన తర్వాత భారత భూభాగానికి పడమరన ప్రస్తుతం ఉన్న భూభాగంతో పాటు తూర్పు బెంగాల్‌ భూభాగం పాకిస్తాన్‌కు దక్కాయి. రెండు ప్రాంతాల మధ్య భూగోళిక దూరమే కాకుండా, రెండు ప్రాంతాల ప్రజల మధ్య కూడా భాషా సాంస్కృతికపరమైన పొరపొచ్చాలు ఉండేవి. తూర్పు బెంగాల్‌లో చెలరేగిన ఆందోళనలను అణచివేసేందుకు పాకిస్తాన్‌ 1971లో సైన్యాన్ని రంగంలోకి దించింది. పాక్‌ సైన్యం ఆందోళనకారుల ఊచకోతకు తెగబడింది. దీంతో తూర్పు బెంగాల్‌ శరణార్థులు సురక్షితంగా వచ్చేందుకు వీలుగా భారత్‌ తూర్పు వైపు సరిహద్దులను తెరిచింది. భారత్‌ సరిహద్దులు తెరుచుకోవడంతో బెంగాలీ శరణార్థులు వెల్లువలా ఇక్కడకు చేరుకున్నారు.

బెంగాలీలు కోరుకున్నట్లుగా వారి స్వాతంత్య్రం కోసం భారత్‌ యుద్ధానికి వెళ్లడమే దేశానికి ఆర్థికంగా మంచిదని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తలచారు. వెంటనే అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మానెక్‌ షాతో చర్చలు జరిపి, యుద్ధాన్ని ప్రకటించారు. పట్టుమని పదమూడు రోజుల్లో యుద్ధం ముగిసిపోయింది. ఈ యుద్ధంలో భారత్‌ గెలుపు సాధించింది. దీనికి ఫలితంగా బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. తొలుత జమ్ము కశ్మీర్‌ విషయంలోను, తర్వాత బంగ్లాదేశ్‌ విషయంలో భారత్‌ చేతిలో ఎదురైన భంగపాట్లకు ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్‌ విఫలయత్నాలు సాగిస్తూనే వస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే కార్గిల్‌ యుద్ధం తలెత్తింది. కార్గిల్‌ యుద్ధం 1999లో జరిగినా, పాకిస్తాన్‌ అందుకు చాలా ఏళ్లు ముందుగానే పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆ యుద్ధంలో భారత సైన్యానికి నాయకత్వం వహించిన జనరల్‌ వేదప్రకాశ్‌ మాలిక్‌ అప్పట్లో మీడియాకు వెల్లడించారు. కార్గిల్‌ యుద్ధానికి దాదాపు ఏడాది ముందే పాకిస్తాన్‌ రెండు వారాల వ్యవధిలో రెండుసార్లు అణుపాటవ పరీక్షలు జరిపింది. తర్వాత పాక్‌ సేనలు సరిహద్దుల్లోని కార్గిల్‌ సెక్టార్‌లోని భారత సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడ్డాయి.

గొర్రెల కాపరుల ద్వారా సమాచారం
పాకిస్తాన్‌ చొరబాటుపై కార్గిల్‌ ప్రాంతంలోని గొర్రెల కాపరుల ద్వారా భారత సైన్యానికి 1999 మే 3న తొలుత సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం మే 5న అక్కడకు పెట్రోలింగ్‌ బృందాన్ని పంపింది. అప్పటికే పెద్దసంఖ్యలో మోహరించిన పాక్‌ బలగాలతో ఘర్షణ జరిగింది. ఘర్షణలో పట్టుబడ్డ ఐదుగురు భారత సైనికులను పాక్‌ సైనికులు దారుణంగా హింసించి, చంపేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరిట భారత సైన్యం కూడా పెద్దసంఖ్యలో బలగాలను కార్గిల్‌ సెక్టార్‌కు తరలించింది. భారత వైమానిక దళం కూడా చొరబాటుదారులపై దాడుల్లో సైన్యానికి అండగా నిలిచింది. కార్గిల్‌ ప్రాంతం నుంచి 1999 జూలై 14 నాటికి పాక్‌ సేనలను పూర్తిగా తరిమిగొట్టామని, ‘ఆపరేషన్‌ విజయ్‌’ విజయవంతమైందని వాజ్‌పేయి ప్రకటించారు. మిగిలిన చొరబాటుదారులందరినీ కూడా జూలై 26 నాటికి పూర్తిగా తరిమికొట్టడంతో యుద్ధం పూర్తిగా ముగిసింది.

ఎవరి బలగాలెంత?
పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో భారత్‌కు యుద్ధం ముప్పు పొంచే ఉంది. అందుకే భారత్‌ పొరుగు దేశాల బలాబలాలపై ఒక కన్నేసి ఉంచుతూ, సొంత సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తోంది. భారత్‌తో పాటు పాకిస్తాన్, చైనాలు కూడా అణ్వాయుధ దేశాలే. సైనిక బలంలో చైనా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. సైనిక వ్యయంలో చైనాకు, భారత్‌కు భారీ వ్యత్యాసాలే ఉన్నాయి. ప్రస్తుతం 2015–19 వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఈ ఐదేళ్ల వ్యవధిలో చైనా వార్షిక సైనిక వ్యయం 213.5 బిలియన్‌ డాలర్ల నుంచి 261 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో భారత్‌ వార్షిక సైనిక వ్యయం 54.3 బిలియన్‌ డాలర్ల నుంచి 71.1 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. పాకిస్తాన్‌ వార్షిక చైనా వ్యయం 9.1 బిలియన్‌ డాలర్ల నుంచి 11.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. చైనా, భారత్‌లతో పోలిస్తే, సైనికపరంగా పాకిస్తాన్‌ను చాలా వెనుకబడిన దేశంగానే పరిగణించవచ్చు. ‘గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌’ నివేదిక ప్రకారం వైమానిక బలంలో చైనా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంటే, భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. చైనా వద్ద 3,210 యుద్ధ విమానాలు ఉంటే, భారత్‌ వద్ద 2,123 యుద్ధ విమానాలు ఉన్నాయి. యుద్ధట్యాంకుల విషయంలో మాత్రం చైనా కంటే భారతే ముందంజలో ఉంది. భారత్‌ వద్ద సుమారు 4,200 యుద్ధ ట్యాంకులు ఉంటే, చైనా వద్ద 3,200 వరకు మాత్రమే ఉన్నాయి. చైనా వద్ద యుద్ధ వాహనాలు 33,000 వరకు ఉంటే, భారత్‌ వద్ద సుమారు 8,600 మాత్రమే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం చైనా వద్ద భారత్‌ కంటే పదిరెట్లు రాకెట్‌ ప్రాజెక్టర్లు ఉన్నాయి.

చైనా వద్ద 2,650 రాకెట్‌ ప్రాజెక్టర్లు ఉంటే, భారత్‌ వద్ద ఇవి కేవలం 266 మాత్రమే ఉన్నాయి. చైనా వద్ద 74 జలాంతర్గాములు ఉంటే, భారత్‌ వద్ద ఇవి 16 మాత్రమే ఉన్నాయి. భారత్‌ వద్ద ఉన్న క్షిపణుల్లో ‘పృథ్వి–1 క్షిపణి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ‘పృథ్వి–2’ 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. క్షిపణుల విషయంలో చైనా శక్తి అపారం. చైనా వద్ద ఖండాంతర లక్ష్యాలను సైతం ఛేదించగల క్షిపణులు భారీగానే ఉన్నాయి. చైనాతో ఇదివరకు 1962లో ఒకసారి మాత్రమే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చైనా గెలుపు సాధించింది. ఆ తర్వాత పలుసార్లు సరిహద్దుల వద్ద ఉభయ దేశాలకు చిన్నపాటి సమస్యలు తలెత్తినా, పరిస్థితులు తిరిగి యుద్ధం వరకు వెళ్లలేదు. బలాబలాల సంఖ్యలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ కంటే నిస్సందేహంగా చైనానే ఆధిక్యతలో ఉంది. అంతమాత్రాన ఇరు దేశాలకు యుద్ధమే జరిగితే చైనా గెలిచి తీరుతుందనే నమ్మకమేదీ లేదని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చైనా తన బలగాల్లో దాదాపు సగానికి పైగా బలగాలను రష్యా సరిహద్దుల వద్ద రక్షణ కోసమే మోహరించి ఉంచుతోంది. చైనా యుద్ధ విమానాల కంటే భారత్‌ వద్దనున్న యుద్ధ విమానాలు చాలా అధునాతనమైనవని, ఇవన్నీ ఒక ఎత్తయితే అంతర్జాతీయ వేదికపై చైనాతో పేచీలు ఉన్న దేశాల సంఖ్య ఎక్కువ కావడంతో పరిణామాలు చైనాకే ప్రతికూలంగా ఉంటాయని ‘సెంటర్‌ ఫర్‌ ఎ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ (సీఏఎన్‌ఎస్‌) నివేదిక అభిప్రాయపడింది. మరోసారి యుద్ధం జరగాలని భారత్‌ కోరుకోకపోయినా, పొరుగు దేశాల బలాబలాలపై ఎప్పటికప్పుడు ఒక కన్నువేసి ఉంచుతూ, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉంటోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top