డెహ్రాడూన్: ‘‘దేశ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు చట్టాల కొరత కాదు. అవి సామాన్య ప్రజలకు ఆశించినంతగా అందుబాటులో లేకపోవడమే’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. చట్టపరమైన హక్కులకు, వాటి ఆచరణాత్మక లభ్యతకు మధ్య అంతరాన్ని తక్షణమే పూడ్చాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. మన దేశంలో హక్కులు, విధానాలకు సంబంధించి పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ.. దూరం, జాప్యం, అమలులో లోపాల కారణంగా ఆయా ప్రయోజనాలు నిరుపేదలకు చేరడం లేదని వివరించారు.
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాష్ట్ర హైకోర్టు, నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ (నల్సా), ఉత్తరాఖండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నార్త్ జోన్ ప్రాంతీయ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. ‘‘న్యాయం కేవలం ఉనికిలో ఉంటే చాలదు. అది ప్రతి పౌరుడి ముంగిటికీ సకాలంలో చేరాలి’’ అని స్పష్టంచేశారు. ఒక గణతంత్ర దేశపు బలాన్ని అది ప్రకటించుకున్న హక్కుల ద్వారా కాకుండా, సాకారమైన హక్కుల ద్వారానే కొలవాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు హక్కులు ఉన్నప్పటికీ.. అవి వారికి సులువుగా చేరే మార్గాలు, వేదికలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం న్యాయ వ్యవస్థ బాధ్యత అని పిలుపునిచ్చారు.


