సైబర్ నేరాలను అరికట్టండి
మాదకద్రవ్యాల పీచమణచండి
ఎల్నినోను సమర్థంగా ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వండి
నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్రాలకు ప్రధాని దిశానిర్దేశం
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ 11వ పాలకవర్గ సమాశంలో రాష్ట్రాలకు దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్లు, రాబోయే సువర్ణావకాశాలపై ప్రధాని మోదీ దిశానిర్దేశంచేశారు. 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో గంటల తరబడి సుదీర్ఘంగా మోదీ సమావేశమై పలు అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించి ఫిర్యాదులు, అభిప్రాయాలను స్వీకరించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.
వార్షిక సమావేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీఎంలనుద్దేశించి ఆయా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై మోదీ ప్రసంగించారు. ‘‘గోప్యత, పారదర్శకత, సామాజిక విలువలను పాటిస్తూనే కృత్రిమ మేధను విరివిగా ఉపయోగించండి. ఏఐతో అందివచ్చే అవకాశాలను ఒడిసిపట్టండి.
అత్యంత తీవ్రమైన ఎల్ నినో వాతావరణ ఉపద్రవాన్ని తట్టుకునేలా విధానపర నిర్ణయాలు తీసుకోండి. నీటి సంరక్షణ చర్యలు చేపట్టండి. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూనే పలు రంగాల్లో దేశం ఆత్మనిర్భరత సాధించేందుకు కృషిచేయండి. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో స్వావలంబనకు బాటలువేయండి. పలు దేశాలతో భారత్ కొత్త వాణిజ్య ఒడంబడికలు చేసుకుంది.
ఈ మేరకు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల పునరుజ్జీవనానికి పాటుపడండి. తద్వారా ఆయా రంగాల భాగస్వామ్యంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించండి. సమాఖ్య స్ఫూర్తిని మరోసారి చాటండి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయానికి పాటుపడండి. అప్పుడే రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెంది అభివృద్ధి చెందిన దేశంగా సాకారమవుతుంది.
‘వికసిత్ భారత్’ఆవిర్భావం కోసం అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్లు, గ్రామాల సంకల్పం తీసుకోవాలి. పౌర అవగాహన, సుపరిపాలన ద్వారా మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు వంటి వాటిని కట్టడిచేయండి. చక్కటి పరిపాలన, పారదర్శకత, మౌలిక వసతుల కల్పనతో పెట్టుబడులను ఆకర్షించవచ్చు. స్థానిక వస్తూత్పత్తుల బ్రాండింగ్పై దృష్టిపెట్టండి. సులభతర వాణిజ్యానికి తగ్గట్లు విధానపర నిర్ణయాలు తీసుకోండి.
డేటా సెంటర్లు, కృత్రిమ మేధ వంటి రంగాల్లో కొత్త అవకాశాలను ఒడిసిపట్టండి. నవతరం ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనివ్వండి. భవిష్యత్ ఆర్థికవ్యవస్థకు నిపుణ మానవవనరుల అవసరం అత్యావశ్యకం. ఏఐను ఆ కోణంలో అవకాశాల గనిగా భావించండి. మన 70 కోట్ల యువత మనకు అతిపెద్ద ఆస్తి. ఇంతపెద్ద ఆస్తిని దేశాభివృద్ధి ఫలాలిచ్చే ఆదాయ వృక్షాలుగా మార్చండి. దేశంలో రక్షణరంగ ఉపకరణాల తయారీ రంగం వేగంగా విస్తరిస్తోంది.
తగు మౌలికవసతుల్ని కల్పించి ఈ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచండి. జిల్లాకో విభిన్న ఉత్పత్తి తరహాలో ఎగుమతులే లక్ష్యంగా వ్యూహాలు రచించండి’’అని రాష్ట్రాలకు మోదీ సూచించారు. సమ్మిళిత మానవాభివృద్ధి ఇతివృత్తంతో సమావేశం జరిగిందని తర్వాత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ లాహిరి తెలిపారు.
‘‘ప్రాథమిక మానవ వనరులు, నవ్యనూతన నైపుణ్యాలు, ఫలవంతమైన ఉపాధి, పరిశ్రమలను స్థాపించే సత్తా, వికేంద్రీకరణ అభివృద్ధి, ఆరోగ్యం, పోషణ, సమానత్వం, అందరికీ గౌరవమర్యాదలు లక్ష్యసాధనగా ఈ సమావేశం జరిగిందని లాహిరి తెలిపారు. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, జమ్మూకశీ్మర్ ముఖ్యమంత్రులతో మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల సమస్యలపై ఆయా రాష్ట్రాల సీఎంలు చెప్పిన విషయాలను మోదీ విన్నారు.


