ఢిల్లీలో అన్నామలై.. రెండు రోజుల్లో జరిగేది ఇదేనా? | Ex BJP President Annamalai Delhi Visit Amid New Party Rumours Sparks Political Buzz, Says I Will Reveal Everything In Two Days | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో అన్నామలై.. రెండు రోజుల్లో జరిగేది ఇదేనా?

Jun 2 2026 7:14 AM | Updated on Jun 2 2026 8:38 AM

I Will Reveal Everything In Two Days: Former Bjp President Annamalai

బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండురోజుల్లో అన్ని చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మద్దతుదారులు పోస్టర్లను హోరెత్తిస్తున్నారు.

ఈ పరిస్థితులలో చెన్నై నుంచి ఢిల్లీకి ఆయన బయలుదేరి వెళ్లారు. సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆయన బీజేపీ జెండా లేని కారులో రావడం చర్చకు దారి తీసింది. ఆయన్ని మీడియా ప్రతినిధులు చుట్టు ముట్టి ప్రశ్నలను సంధించగా, అన్నింటికి రెండురోజులలో సమాధానం చెబుతానని, కూర్చుని మాట్లాడుకుందామని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటూ ముందుకెళ్లారు. కాగా, ఢిల్లీ వెళ్లిన అన్నామలై మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

కాగా, కె.అన్నామలై త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు సోమవారం తమిళనాట వార్తలు షికార్లు చేశాయి. వీటిపై ఆయన స్పందించలేదు. కానీ సోమవారం హడావుడిగా ఢిల్లీకి వెళ్లి పార్టీ చీఫ్‌ నితిన్‌ నబిన్‌తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. ఢిల్లీకి వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న అన్నామలైను మీడియా పలకరించింది. ‘‘రెండ్రోజుల్లో మనందరం కూర్చుని మాట్లాడుకుందాం. నా తదుపరి కార్యాచరణను మీకు తెలియజేస్తా’’అని చెప్పి వెళ్లిపోయారు.

త్వరలో ఆయన సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వార్తలొచ్చాయి. బీజేపీలో తనకిక భవిష్యత్‌ లేదు అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే చీఫ్‌ విజయ్‌ జోసెఫ్‌ ప్రభంజనం ధాటికి ప్రధాన ద్రవిడ పార్టీలు చెల్లాచెదురుకాగా బీజేపీ కేవలం ఒకే ఒక్క చోట విజయబావుటా ఎగరేసింది.

జూన్‌ నాలుగోతేదీన అన్నామలై పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో అదేరోజున ఆయన తన రాజకీయ భవిష్యత్‌ నిర్ణయాలను వెలువరించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. 41 ఏళ్ల అన్నామలై 2011 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. బెంగళూరు సౌత్‌ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీచేసిన కాలంలో 2019లో హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామాచేసి తమిళనాడులో రాజకీయాల్లో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్‌గా ఉంటూ మంచి పేరు సంపాదించారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement