హమాస్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడికి మోదీ ఫోన్‌ | Hamas Israel War: PM Modi speaks to Palestinian President | Sakshi
Sakshi News home page

హమాస్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడికి మోదీ ఫోన్‌

Oct 19 2023 7:52 PM | Updated on Oct 19 2023 8:28 PM

Hamas Israel War: PM Modi speaks to Palestinian President - Sakshi

హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య భీకర పోరు 13 రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్‌ నేతలు, వారి స్థావరాలనే తుడిచిపెట్టడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరుపుతుండగా.. హమాస్‌ సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఆధిపత్య పోరులో ఇరువర్గాలకు చెందిన 5000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.ఒక్క గాజాలోనే 1,524 మంది చిన్నారులతో సహా 3,700 మంది మ​ృత్యువాతపడ్డారు

హమాస్‌ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్‌ మధ్యజరుగుతున్న యుద్ధంపై ప్రపంచ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే దాడులను ఆపేయాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాజాలోని అల్పై‌ అహ్లీ ఆసుపత్రిపై జరిగిన దాడిలో సంభవించిన ప్రాణ నష్టంపై సంతాపం ప్రకటించారు.  యుద్ధం కొనసాగుతన్న వేళ.. పాలస్తీనా ప్రజలకు  భారత్‌ను మానవతా సాయం అందించడం కొనసాగుతుందని మోదీ పేర్కొన్నారు. 

ఈ మేరకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు.  పాలస్తీనియన్ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడాను. . గాజాలోని  ఆసుపత్రిపై  దాడిలో బాధితులకు నా సంతాపాన్ని తెలియజేశాను. పాలస్తీనా ప్రజల కోసం మానవతా సహాయం పంపడం కొనసాగిస్తాం. పాలస్తీనాలో తీవ్రవాదం, హింస క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారత్‌ తన దీర్ఘకాల సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు.
చదవండి: ఇజ్రాయెల్‌కు పూర్తి మద్ధతు: రిషి సునాక్‌

ఇదిలా ఉండగా.. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఇజ్రాయెల్‌లో పర్యటించి..ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులను ముక్త కంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. హమాస్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్‌ దేశానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఇరు దేశాల అగ్రనేతలు వెల్లడించారు. ఈ  క్రమంలో మోదీ పాలస్తీనా అధ్యక్షుడికి ఫోన్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement