కేసు క్లోజర్‌ రిపోర్టు ఇచ్చాక.. తదుపరి దర్యాప్తునకు  కోర్టు అనుమతి తప్పనిసరి! | Further Investigation permissible after the final report laid before the Magistrate | Sakshi
Sakshi News home page

కేసు క్లోజర్‌ రిపోర్టు ఇచ్చాక.. తదుపరి దర్యాప్తునకు  కోర్టు అనుమతి తప్పనిసరి!

May 29 2026 2:24 AM | Updated on May 29 2026 2:24 AM

Further Investigation permissible after the final report laid before the Magistrate

సుప్రీంకోర్టు కీలక ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: ఏదైనా ఒక కేసులో ఆధా రాలు లేవంటూ పోలీసులు క్లోజర్‌ రిపోర్టు ఇచ్చిన తర్వాత, అదే కేసుపై తదుపరి దర్యా ప్తు చేపట్టాలంటే మేజిస్ట్రేట్‌ నుంచి ముందుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మూసేసిన కేసులో మేజి స్ట్రేట్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌ పర్మిషన్‌ తీసుకో కుండా తదుపరి దర్యాప్తు కొనసాగించడం చెల్లదని స్పష్టం చేసింది. క్రిమినల్‌ కేసుల్లో పోలీసులకు గల దర్యాప్తు అధికా రాల విషయంలో ఈ తీర్పును అత్యంత కీలకమైందిగా భావిస్తున్నారు. 

గురువారం ఈ మేరకు జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. పిటిషనర్‌ పళనిస్వామి వీరరాజాకు ఊరట కల్పించింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 173(8) ప్రకారం తదుపరి దర్యా ప్తునకు మెజిస్ట్రేట్‌ అనుమతి అవసరంలేదని కర్ణాటక హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది వి.మోహన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చట్టంలో నేరుగా పేర్కొనకపోయినా, కోర్టు అనుమతితోనే తదుపరి దర్యాప్తు జరగాలనే నిబంధన ఉన్న విషయం తెలుసుకోవాలన విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం ఏకీభవించింది. 

‘చట్టంలో ఎక్స్‌ప్రెస్‌ పర్మిషన్‌ అవసరమని లేకపోయినా, న్యాయ పరిణామ క్రమంలో సంబంధిత మేజిస్ట్రేట్‌ నుంచి అనుమతి కోరడం ఒక అవసరంగా రూపుదిద్దు కుంది’అంటూ స్పష్టం చేసింది. ‘రామ చౌదరి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్, (2013) 5 ఎస్‌సీసీ 762, వినయ్‌ త్యాగి వర్సెస్‌ ఇర్షాద్‌ (2013) 5 ఎస్‌సీసీ 762, పీతాంబరన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ(2023), ఎస్‌సీసీ 402, రాబర్ట్‌ లాల్‌చుంగ్నుంగా చోంగ్తూ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ (2025) కేసులను ధర్మాసనం గుర్తుచేసింది.

 ‘కోర్టు అనుమతి కోరడం, సప్లిమెంటరీ రిపోర్టు దాఖలు చేయడం అనే అవసరాన్ని సెక్షన్‌ 173(8) నిబంధనల్లో చదువు కోవాలి. ఇది తప్పనిసరి’అంటూ వినయ్‌ త్యాగి కేసులోని తీర్పును ధర్మాసనం ఉటంకించింది. ‘ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని మళ్లీ దర్యాప్తు పేరుతో వేధించకుండా ఈ తీర్పు అడ్డుకుంటుంది. కేసుపై కోర్టు పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఇది పౌరులకు రక్షణ వంటిది’అని ధర్మాసనం వివరించింది. ఒకసారి కేసు మూసేశాక, మేజిస్ట్రేట్‌కు తెలియకుండా పోలీసులు మళ్లీ దర్యాప్తు చేయలేరని స్పష్టంగా ప్రకటించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement