జబల్పూర్: మధ్యప్రదేశ్లోని బర్గి డ్యామ్లో నర్మదా నది అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకుల విహారయాత్ర ఘోర విషాదంగా మారింది. 29 మంది పర్యాటకులతో వెళ్తున్న పర్యాటక బోటు ఒక్కసారిగా మునిగిపోవడంతో నలుగురు మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు. ఖమారియా ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
అధికారుల సమాచారం ప్రకారం, 15 మంది పర్యాటకులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆకస్మిక వాతావరణ మార్పులు, ఈదురుగాలుల వల్ల బోటు అదుపు తప్పి మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని, రాత్రంతా సెర్చ్ లైట్ల సహాయంతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
జబల్పూర్ జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్, ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం జబల్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. కాగా, లైఫ్ జాకెట్ ధరించిన బోటు కెప్టెన్ మహేష్ పటేల్ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రాకేష్ సింగ్ మాట్లాడుతూ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సుమారు 10 మందిని రక్షించాయని తెలిపారు.


