
సుపరిపాలన, సామాజిక న్యాయానికి పెద్దపీట
కేబినెట్లో 60 శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలే
‘వికసిత్ భారత్’ నిర్మాణానికి కలిసి పనిచేద్దాం
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో ప్రజలకు సుపరిపాలన అందించడం, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడంపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని, తమ మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలే ఉన్నారని గుర్తుచేశారు. మంత్రిమండలిలో ఆయా వర్గాలకు ఈస్థాయిలో అత్యధిక ప్రాతినిధ్యం దక్కడం ఇదే మొదటిసారి అని స్పష్టంచేశారు.
కేంద్రంలో తమ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తికావడంతోపాటు మూడోసారి ప్రధానిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నేడు మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే కాకుండా అంతర్జాతీయ వేదికలపై బలమైన గొంతుకగా నిలుస్తోందని ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై మనం గళం వినిపిస్తున్నాయని చెప్పారు.
140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు, వారి సమ్మిళిత భాగస్వామ్యంతో విభిన్న రంగాల్లో వేగవంతమైన మార్పునకు భారత్ సాక్షిగా నిలుస్తోందని హర్షం వ్యక్తంచేశారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ స్ఫూర్తితో ఎన్డీయే ప్రభుత్వం ప్రజాసేవలో నిమగ్నమైందని వివరించారు. ‘ప్రజలే కేంద్రంగా ప్రగతి’ అనే విధానాన్ని అమలు చేస్తున్నామని, ఆర్థికాభివృద్ధితో సామాజిక మార్పునకు బాటలు వేస్తున్నామని స్పష్టంచేశారు.
మన ఉమ్మడి విజయాలు మనందరికీ గర్వకారణమని, అదే సమయంలో ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి మనమంతా నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆశ, ఆత్మవిశ్వాసం, నూతన సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. వేర్వేరు రంగాల్లో తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకొచ్చిన మార్పులను ప్రధాని మోదీ ‘లెవెన్ ఇయర్స్ ఆఫ్ సేవ’ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభుత్వ పథకాలు, లబి్ధదారుల వివరాలు ఇందులో పొందుపర్చారు.