చైనా కొత్త గ్రామాల నిర్మాణం: తొలిసారి పెదవి విప్పిన భారత్‌ | China building villages well within its side of LAC | Sakshi
Sakshi News home page

చైనా కొత్త గ్రామాల నిర్మాణం: తొలిసారి పెదవి విప్పిన భారత్‌

Nov 12 2021 6:27 AM | Updated on Nov 12 2021 10:30 AM

China building villages well within its side of LAC - Sakshi

న్యూఢిల్లీ: భారత భూభాగంపై చైనా ఒక కొత్త గ్రామాన్నే నిర్మిస్తోందన్న ప్రచారంపై చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ స్పందించారు. అందులో నిజం లేదని తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా తన భూభాగంలోనే కొత్త గ్రామాల నిర్మాణం సాగుతున్నట్లు వెల్లడించారు.

మన గడ్డపై చైనా అడుగు పెట్టలేదన్నారు. ఆయన గురువారం టైమ్స్‌ నౌ సదస్సులో మాట్లాడారు. భారత్, చైనా సైనిక బలగాలు సరిహద్దు వద్ద వారికి నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఉన్నాయని వెల్లడించారు. భవిష్యత్తు అవసరాల కోసం సైనికులను తరలించడానికి చైనా ప్రభుత్వం వారి భూభాగంలోనే కొత్త గ్రామాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోందని రావత్‌ పేర్కొన్నారు.   

ఆక్రమణలను ఒప్పుకోం: భారత్‌
సరిహద్దు వెంట భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడాన్ని ఏనాడూ అంగీకరించలేదని భారత్‌ తాజాగా స్పష్టంచేసింది. సరిహద్దు వెంట పరిస్థితులపై చైనా చేస్తున్న అసంబద్ధ వాదనలతో తాము ఏకీభవించబోమని భారత్‌ తెలిపింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తూర్పు సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చివరి భారత భూభాగంలో కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించి గ్రామాన్ని నిర్మించిందన్న అమెరికా నివేదికపై భారత్‌ తొలిసారిగా పెదవి విప్పింది.

ఈ అంశాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిది అరిందం బాగ్చీ  మాట్లాడారు. ‘ సరిహద్దు వెంట చైనా నిర్మాణ కార్యకలాపాలు జోరందుకున్నాయని మాకు తెలుసు. దశాబ్దాల క్రితం ఆక్రమించిన ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని మాకు సమాచారముంది. అమెరికా నివేదికనూ  పరిగణనలోకి తీసుకున్నాం’ అని అరిందం చెప్పారు. ‘ భారత భూభాగాలను ఆక్రమించడాన్ని మేం ఏనాడూ అంగీకరించలేదు. అవి మా ప్రాంతాలేనంటూ చైనా చేసిన వాదనలనూ మేం ఒప్పుకోలేదు. దౌత్య మార్గాల్లో భారత్‌ తన నిరసనను వ్యక్తంచేసింది’ అని ఆయన స్పష్టంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement