త్రిసభ్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసిన కలకత్తా హైకోర్టు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కర్ బోధనాస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో కేసు పూర్వాపరాలు, కీలకాంశాలను బయటితీసే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటుచేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు ఆదేశాలిచ్చింది.
2024 ఆగస్ట్ 9వ తేదీ రాత్రి విధులు ముగించుకుని పీ ట్రైనీ వైద్యురాలు భోజనం చేసింది మొదలు రేప్, హత్య, సాక్ష్యాధారాలను ధ్వంసంచేయడం, మృతదేహానికి పోస్ట్మార్టమ్, అంత్యక్రియల దాకా జరిగిన క్రమంలో దర్యాప్తులో ఇప్పటిదాకా వెలుగులోకిరాని అంశాలను తెల్సుకునేందుకు సీబీఐ సిట్ రంగంలోకి దిగుతుందని జస్టిస్ షాంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్ల హైకోర్టు డివిజన్ బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది.
2025 మార్చి 28వ తేదీన అందిన నివేదికలో తీవ్రమైన లోపాలున్నాయని, వాటిని నిగ్గుతేల్చేందుకే సిట్ ఏర్పాటుచేశామని ధర్మాసనం వెల్లడించింది. సీబీఐ ఈస్ట్ జోన్ జాయింట్ డైరెక్టర్ సారథ్యంలో సిట్ పనిచేస్తుందని, సిట్లో ఇతర సభ్యుల పేర్లను 48 గంటల్లోపు ఖరారుచేస్తామని కోర్టు తెలిపింది. దర్యాప్తు పూర్తిచేసి జూన్ 25వ తేదీలోపు సిట్ తన నివేదికను కోర్టుకు సమరి్పంచాల్సి ఉంటుంది.
వైద్యురాలిని రేప్చేసి చంపేసిన నిందితుడు, పౌర వలంటీర్ సంజయ్రాయ్కు ఇప్పటికే జీవితఖైదు పడింది. హేయమైన హత్యోదంతంలో సాక్ష్యాధారాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసంచేశారని, హత్య విషయాన్ని తొలుత తమకు తెలియజేయలేదని, హడావుడిగా సృష్టించి కేసు తీవ్రతను పోలీసులు, ఆస్పత్రి అధికారులు తగ్గించే ప్రయత్నంచేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘‘హత్యోదంతంలో పోలీసులు, ఆస్పత్రి యాజమాన్యం తప్పిదాలతోపాటు తీవ్ర నిర్లక్ష్యపూరిత వైఖరి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఆరోపణలను నివృత్తిచేసేందుకు సిట్ దర్యాప్తు అక్కరకొస్తుంది’’అని ధర్మాసనం అభిప్రాయపడింది.


