చెన్నైలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
మంత్రులుగా తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం
వాగ్దానాల అమలుకు వేదికపైనే విజయ్ శ్రీకారం
ఉచిత విద్యుత్, మహిళల భద్రత, డ్రగ్స్ కట్టడిపై మూడు సంతకాలు
పాలనలో నూతన శకం మొదలైందని ప్రకటన
ప్రజల రుణం తీర్చుకోవడానికొచ్చా.. ప్రజాధనం ముట్టుకోబోనని ప్రతిన
రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం హోదాలో తొలి సమీక్ష
ప్రొటెం స్పీకర్గా టీవీకే ఎమ్మెల్యే కరుప్పయ్య ప్రమాణం
నేడు నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
సాక్షి, చెన్నై: తమిళనాడులో ద్రవిడ పార్టీల పరిపాలనా పర్వానికి తెరదించుతూ తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ సి.జోసెఫ్ విజయ్ ఆదివారం నూతన ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. ఆత్మీయులు, కుటుంబసభ్యులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత 60 ఏళ్ల తమిళనాడు చరిత్రలో డీఎంకే, అన్నాడీఎంకే ప్రమేయం లేని ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇదే తొలిసారి.
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10.15 గంటలకు అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం ఆరంభమైంది. విజయ్తో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేయించారు. టీవీకేలోని 9 మంది నేతలు మంత్రులుగా ప్రమాణంచేశారు. టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సైతం భాగస్వామిగా చేరిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ, తమిళనాడులో బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్, సినీ నటి త్రిష, వామపక్ష పార్టీల రాష్ట్ర ముఖ్యనేతలు ముందువరసలో కూర్చుని ప్రమాణస్వీకారాన్ని చూశారు. పలువురు ప్రముఖులు, తమిళ సినీతారలు, టీవీకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అభిమానుల ‘విజిల్’ మోతలు, ‘సీఎం విజయ్’, ‘దళపతి’ నినాదాలతో ఇండోర్ స్టేడియం మార్మోగిపోయింది. విజయ్ తన మంత్రివర్గంలో యువత, అనుభవజ్ఞులకు ప్రాధాన్యమిచ్చారు. సీఎంగా ప్రమాణంచేశాక విజయ్ ఉద్వేగంగా ప్రసంగించారు. నిజమైన లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే పాలనకు సంబంధించిన నూతన శకం ఇప్పుడే ప్రారంభమైందని స్పష్టంచేశారు.
తనదైన శైలిలో ప్రమాణం చేయబోయి..
విజయ్తో సీఎంగా ప్రమాణం చేయించేందుకు ఆయనను పోడియం వద్దకు గవర్నర్ ఆహ్వానించారు. ‘నేను’ అని గవర్నర్ అందివ్వగా అధికారికంగా ఇచ్చిన ప్రమాణపత్రాన్ని కాదని సొంతంగా తనదైన శైలిలో ప్రమాణంచేసేందుకు విజయ్ ప్రయ తి్నంచారు. వెంటనే గమనించిన గవర్నర్ సున్నితంగా అడ్డుకుని రాజ్యాంగంలో పేర్కొన్న శైలిలోనే ప్రమాణం చేయాలని సూచించారు.
తొలి రోజే వివాదం
ప్రమాణ స్వీకారోత్సవంలో గాయకులు వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను ఆలపించడం విశేషం. సాధారణంగా అధికారిక కార్యక్రమంలో మొదటి రెండు చరణాలను ఆలపిస్తారు. అయితే, మొత్తం ఆరు చరణాలను ఆలపించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రమాణ స్వీకార వేడుకలో తమిళ తల్లి గీతం.. తమిళ్ తాయ్ వాళ్తుకు మూడో స్థానం కల్పించడాన్ని సీపీఐ, డీఎంకేలు తీవ్రంగా పరిగణించాయి.
వందేమాతరం, జనగణమన అనంతరం తమిళ్ తాయ్ వాళ్తు గీతాన్ని ఆలపించారు. ప్రాధాన్యతా క్రమంలో తమిళ గీతానికి మూడోస్థానం కల్పించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీర పాండియన్, వీసీకే అధినేత థోల్ తిరుమావళవన్తోపాటు సీపీఎం, ఐయూఎంఎల్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని, తమిళ తల్లి గీతానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్చేశారు. అధికారిక కార్యక్రమాల్లో తమిళ తల్లి గీతాన్ని మొదట ఆలపించడం సంప్రదాయమని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్.రాందాస్ గుర్తుచేశారు.
వేదికపై 3 సంతకాలు
ప్రజలకు ఇచ్చిన 3 వాగ్దానాల అమలుకు ప్రమాణ స్వీకార వేదికపైనే విజయ్ శ్రీకారం చుట్టారు. గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. మహిళల భద్రత కల్పించడానికి మహిళలతో ‘సింగా పెన్’ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తూ మరో ఫైల్పై సంతకం చేశారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మహమ్మారిని అరికట్టడమే లక్ష్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా దళం ఏర్పాటు కోసం మరో ఫైల్పై సంతకం చేశారు. తమకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, వామపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. యువత, టీనేజర్లు, చిన్నారులకు విజయ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత సీనియర్ నేత కె.ఎ.సెంగోట్టయన్, యువనేత డాక్టర్ కె.టి.ప్రభు, మహిళా నాయకురాలు ఎస్.కీర్తన, ఆధవ్ అర్జున, ఎన్.ఆనంద్, ఆర్.నిర్మల్ కుమార్, కె.జి.అరుణ్రాజ్, ఎ.రాజ్ మోహన్, పి.వెంకటరమణన్లు ప్రమాణంచేసి మంత్రివర్గంలో చేరారు.
నేనొక్కడినే పవర్ సెంటర్
ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసిన విజయ్ వేదికపై తనదైన శైలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘నా గుండెల్లో నివసించే అభిమానులందరికీ వందనాలు. నేను రాజరిక కుటుంబం నుంచి రాలేదు., సినిమాల్లో రాణించాలని కష్టపడిన ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ కుమారుడిని. ఆకలి, పేదరికం అంటే నాకు బాగా తెలుసు. అందుకే ప్రజలను నా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తా.
తమిళప్రజలు నన్ను సొంత బిడ్డలా, అన్నగా, తమ్ముడిగా ఆదరించి సినిమాల్లో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చా. ప్రజల ఆశీస్సులతో ఈ పదవిలోకి వచ్చా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమిళనాడు ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి, మోయలేని భారాన్ని మనపై వదిలివెళ్లింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం.
మా ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేయదు. రహస్యంగా ఎవర్నీ కలవదు. ఏది చేసినా ప్రజల సాక్షిగా బహిరంగంగానే చేస్తాం. ప్రజల సొమ్ము నుంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోను. నేను తప్పు చేయను. ఎవరినీ చేయనివ్వను. నా ప్రభుత్వంలో అధికారులైనా, మంత్రులైనా ఎవరైనా ఒకే మాట మీద నడవాలి. ఇక్కడ పవర్ సెంటర్లు ఉండవు. అంతా నా నాయకత్వంలోనే నడుస్తుంది. నేనే ఏకైక పవర్ సెంటర్.
గెలవగానే ఆటలు ఆడదాం అనుకునే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇప్పుడే ఆ ఆలోచన మానుకోండి. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరి కోసం సమప్రాధాన్యంతో పరిపాలిస్తా. హామీల అమలుకు కొంత సమయం ఇవ్వండి. నేను దేవదూతను కాదు. సాధారణమైన వ్యక్తిని. విద్యార్థుల కోసం విజయ్ మామ మంచి పనులు చేస్తాడు. భవిష్యత్తులో నాకు అడ్డంకులు సృష్టించేవారు కూడా నాకు శ్రేయోభిలాషులే’’ అని విజయ్ వ్యాఖ్యానించారు.
దేవుడి పేరిట ప్రమాణం
ప్రమాణ స్వీకారంలో దళపతి విజయ్ సరికొత్త ఆహార్యంతో ఆకట్టుకున్నారు. సాధారణంగా నిత్యం ధరించే తెల్లచొక్కా, ఖాకీ రంగు ప్యాంటు కాకుండా ముదురు రంగు ప్యాంటు, తెల్లచొక్కా, దానిపై నలుపురంగు సూట్ ధరించారు. విజయ్ సహా మంత్రులందరూ దేవుడి పేరిట ప్రమాణం చేయడం విశేషం. రాహుల్ గాం«దీతోపాటు కేబినెట్ సహచరులతో, పార్టీ నాయకులతో విజయ్ సెలీ్ఫలు దిగారు. గవర్నర్తో గ్రూప్ ఫొటో సందర్భంగా వేదికపై అడ్డుగా ఉన్న పెద్ద బల్లను పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ సైతం బల్లను పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. శాసనసభ తొలి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణం చేస్తారు. టీవీకే ఎమ్మెల్యే కరుప్పయ్య ప్రొటెం స్పీకర్గా ఆదివారం లోక్భవన్లో ప్రమాణం చేశారు.
తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేగా రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్తోపాటు తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ ఎమ్మెల్యేగా గెలిచారు. నిబంధనల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండగా, తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇకపై పెరంబూర్ ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగుతారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ పంపించారు. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మొదటిసారిగా సచివాలయానికి రాక
ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం విజయ్ సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం సీఎం చాంబర్లో విజయ్ ఆసీనులయ్యారు. కొన్ని అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు. సీఎం హోదాలో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళ భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డ్రగ్స్ కేసుల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


