చండీగఢ్: మాకు ఇప్పుడే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది అంటూ పంజాబ్ ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) ప్రధాన కార్యదర్శి బిక్రమ్ సింగ్ మజీతియా సోషల్ మీడియాలో ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టారు. ‘రాష్ట్రంలో మీ పార్టీ పని అయిపోయింది. మొన్న పార్టీ మారిన ఏడుగురే కాదు, మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా పార్టీ మారబోతున్నారు. అలెర్ట్ అవ్వండి’ అని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో మరో ఇద్దరు లోక్సభ సభ్యులు కూడా త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీని వీడవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి. తరచూ ఆప్ను వీడే నేతల జాబితా పెరుగుతుండగా, మజీతియా ఈ విషయాన్ని కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రస్తావించారు. అయితే, ఆప్ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.
గత వారం యువ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్ను వీడి బీజేపీలో చేరారు. ఫలితంగా ఆప్ రాజ్యసభలో పార్టీ బలంలో మూడింట రెండు వంతులు కోల్పోయింది. చద్దా తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆప్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించగా, ఆప్ మాత్రం ఆయనను ద్రోహిగా అభివర్ణించింది.


