సాక్షి, ఢిల్లీ: అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కేరళ, పుదుచ్చేరిల్లో సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ జరగనుంది. అస్సాంలో మాత్రం పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదింటికే ముగుస్తుంది.
రెండు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూసేందుకు ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.
మూడు చోట్ల.. 296 నియోజకవర్గాల్లో మొత్తం 6.1 కోట్లకు పైగా ఓటర్లు.. తమ హక్కును వినియోగించుకోనున్నారు. అస్సాంలో మెత్తం 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 2.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో ఉన్నారు. కేరళలో 140 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా, 2.71 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 31,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, 9.44 లక్షల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ 1,099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అస్సాంలో బీజేపీ, కేరళలో లెఫ్ట్ కూటమి హ్యాట్రిక్పై కన్నేశాయి. పుదుచ్చేరిలో అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య పోటీ నెలకొంది.
కాకినాడ:
కేంద్రపాలిత యానాం (పుదుచ్చేరి) లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. బరిలో 13 మంది అభ్యర్థులు ఉండగా.. 37,972 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి ఆశోక్, టివికే పార్టీ నుండి తోట రాజు పోటీ చేస్తున్నారు. యానాంలో సా.6 గంటల వరకు జరగనున్న పోలింగ్ జరగనుంది. ఇక్కడ 42 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల సంఘం ఏర్పాటు చేయగా.. అధికారులు 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు.


