కాంగ్రెస్ నేత పవన్ ఖేడా, సీఎం హిమంత సతీమణి రిణికి శర్మ
మరో రెండురోజుల్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్మ రిణికి భూయాన్ శర్మ వద్ద మూడు దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను ఆయన అఫిడవిట్లో వెల్లడించకుండా దాచి పెట్టారని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఆరోపించిన విషయం తెలిసిందే.
పవన్ ఖేడా వ్యాఖ్యలపై సీఎం సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసుల బృందం మంగళవారం దిల్లీలోని పవన్ ఖేడా నివాసానికి వెళ్లారు. అయితే పోలీసులు వెళ్లే సమయానికి పవన్ ఖేడా అక్కడ లేకపోవడంతో.. వారు ఆయనకోసం ఎదురుచూస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
పవన్ ఖేడా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని హిమంత సతీమణి రిణికి భూయాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ ఎటువంటి ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని.. కానీ తనకు మూడు పాస్పోర్టులు ఉన్నాయని కాంగ్రెస్ నేత నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే కాంగ్రెస్ నేతలు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏప్రిల్ 9న అస్సాంలోని 126 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.


