ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
నారాయణపేట: జిల్లాలోని ప్రతి ఒక్క చిన్నారికి విద్య అందించాలనే లక్ష్యంతో ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన జిల్లా స్థా యి సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బడి మానేసిన పిల్లలు, ఇప్పటి వరకు ఏ పాఠశాలలో నూ నమోదు కాని బాలబాలికలు, వలస కుటుంబాల చిన్నారులను ప్రత్యేక సర్వేల ద్వారా గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రా మాలు, తండాలు, కాలనీల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి బడి బయటి పిల్లలను గుర్తించాలన్నారు.
ప్రత్యేక కార్యాచరణ
మూడేళ్లుగా విద్యార్థుల నమోదు గణాంకాలను విశ్లేషించి ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతి పాఠశాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల నమోదు పెంపులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
విస్తృత ప్రచారం
ప్రభుత్వం పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, డిజిట ల్ తరగతులు, ఇంగ్లిష్ మీడియం బోధన, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాలు, క్రీడా సదుపాయాలు, లైబ్రరీలు, కెరీర్ గైడెన్స్ వంటి అంశాల గురించి తల్లిదండ్రులకు విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
దశల వారీగా..
తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు, అంగన్వాడీ టీచర్లు, తల్లుల కమి టీలతో సమావేశాలు నిర్వహించడం జరిగిందని.. మే 28 న యువత, గ్రామ నాయకులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. జూన్ 3న గ్రామసభలు, జూన్ 4 నుంచి 10 వరకు ఇంటింటి సర్వేలు, విద్యార్థుల నమోదు కార్యక్రమాలు చేపట్టనున్నారు. జూన్ 12 నుంచి 19 వరకు పాఠశాల స్థాయిలో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, సీఎంఓ రాజేంద్రకుమార్, ఏఎంఓ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 35 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


