● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
దామరగిద్ద: కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన వరి ధాన్యాన్ని వెంటనే లారీల్లో కేటాయించిన రైస్మిల్లులకు తరలించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. ఆదివారం మండలంలోని బాపన్పల్లిలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సన్నరకం ధాన్యం ఎప్పడికప్పుడు తరలిస్తున్నారని.. దొడ్డురకం ధాన్యాన్ని తరలించేందుకు లారీలు సకాలంలో రాకపోవడంతో నిల్వ చేసినట్లు వివరించారు. కేంద్రంలో ఇప్పటి వరకు ఎన్ని బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు.. ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని ఆరా తీశారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని కేటాయించిన రైస్మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు.


