సేవల విస్తరణకు చర్యలు..
పైలెట్ ప్రాజెక్టుగా మద్దూర్..
గ్రామాల్లో అందని టీ–ఫైబర్ సేవలు
● పరికరాలు అందినా.. ఫలితం శూన్యం
● పైలెట్ ప్రాజెక్టు మద్దూర్లోనూ
అందని సేవలు
● నిరుపయోగంగా కంప్యూటర్లు, సామగ్రి
నర్వ: గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలు విస్తరించేందుకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టినా నేటికీ వినియోగంలోకి రాలేదు. నెట్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లో చాలాచోట్ల ఇప్పటికే అందించిన కంప్యూటర్లు, ఇతర పరికరాలు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి.
పైపులు వేసినా..
గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలందించేందుకు గత ప్రభుత్వం టీ–ఫైబర్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక రూటర్, ఏసీలు, ఆన్లైన్ యూపీఎస్, బ్యాటరీలతో డిస్ట్రిబ్యూషన్ సర్వర్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి గ్రామాలకు నెట్ అందించాలని నిర్ణయించింది. మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్న సమయంలో తాగునీటి పైపులైన్తో పాటు నెట్ కేబుల్ పైప్లు కూడా వేశారు. కానీ సేవలు మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
కాగిత రహిత పాలనకు..
టీ–ఫైబర్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఒక కనెక్షన్తో ఇంట్లో ఫోన్, టీవీలకు ఇంటర్నెట్ అందుతుంది. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినొచ్చు. ఆన్లైన్కి సంబంధించి చాలా పనులు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, ఆదాయ, వ్యయాలను ఆన్లైన్లో పొందుపర్చవచ్చు. మొత్తంగా కాగిత రహిత, పారదర్శక పాలన అందుతుంది. కాగా ప్రస్తుతం రైతువేదికలు, పాఠశాలల్లో మాత్రం టీ–ఫైబర్ సేవలు అందుతున్నాయి.
విద్యార్థుల అవస్థలు..
పైలెట్ మండలం మద్దూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన టీ–ఫైబర్ లైన్తో పాటు హైస్పీడ్ ఇంటర్నెట్ యంత్రాలు అమర్చడం వద్ద రేడియషన్తో విద్యార్థులు అవస్థలు పడ్డారు. తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన యంత్రాల శబ్ధంతో శబ్ధ కాలుష్యం ఏర్పడిందని ఆరోపించారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందకపోవడంతో ప్రైవేట్ ఇంటర్నెట్తో పాఠాలు బోధిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
టీ–ఫైబర్ సేవలు జిల్లా అంతటా విస్తరించేందుకు తగిన చర్యలు చేపడతాం. హైస్పీడ్ ఇంటర్నెట్ను గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో అందించేందుకు అవసరమైన పరికరాల ఏర్పాటుపై కలెక్టర్కు నివేదించాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తాం.
– రవిశంకర్,
జిల్లా మేనేజర్, టీ–ఫైబర్
గతేడాది రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా మద్దూర్ మండలాన్ని ఎంపిక చేశారు. ఈ మండలంలోని 49 గ్రామపంచాయతీల్లో టీ–ఫైబర్ సేవలందించాలని చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలో పనులు పూర్తిచేసి గ్రామపంచాయతీలు, ప్రభుత్వ బడుల్లో టీ–ఫైబర్ సేవల కోసం విద్యుత్ పరికరాలు, ఇంటర్నెట్ యంత్రాలను అమర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా పరికరాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినప్పటికీ అందుబాటులోకి తీసుకరాకపోవడంతో మండల కేంద్రంలో కూడా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రారంభంలో మండల కేంద్రంలోని ఇళ్లకు సిటీ కేబుల్ నెట్వర్క్కు అనుసంధానం చేయడంతో కొన్నిరోజులు ఉచితంగా అందించారు. అనంతరం రూ.300 రుసుం వసూలు చేశారు. అయినప్పటికీ అంతరాయంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.


