ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్తో కలిసి పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో వినతులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ సత్వరమే పరిష్కరించాలని కోరారు. కాగా ప్రజావాణికి 41 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నారాయణపేట: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ నీటి సరఫరాను మరింత పెంచి ఇవ్వాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వైద్య కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ఓడీలతో వైద్య కళాశాల, జిల్లా ఆస్పతి నీటిసమస్యపై చర్చించారు. ప్రస్తుతం ఆస్పత్రికి అందుతున్న నీటి సరఫరాతో పాటు అదనంగా సరఫరా చేయాలని కలెక్టర్ మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ శ్రీనివాస్ను ఆదేశించారు. నాలుగైదు రోజుల్లో ఆస్పత్రికి అదనంగా నీటిని సరఫరా చేస్తామని ఈఈ తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సంపత్కుమార్, జిల్లా ఆస్పత్రి హెచ్ఓడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం..
జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక వివరించారు. సోమ వారం తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి ఓటరు జాబితా స్పెష ల్ ఇంటెన్సివ్ రివిజన్పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్న్స్కు కలెక్టరేట్ నుంచి ఆమె హాజరై జిల్లా వివరాలు వెల్లడించారు. నిజమైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించడం, బీఎల్వోల పనితీరు నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తున్నామని, రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఓటరు పేరు సక్రమంగా మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, ఇన్చార్జ్ ఆర్డీఓ రాజేందర్గౌడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రెడ్క్రాస్ సభ్యత్వాలు నమోదు చేయాలి..
జిల్లాలో రెడ్క్రాస్ సభ్యత్వాలు నమోదు చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవలను జిల్లా అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి కలెక్టర్కు వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి నాయకత్వంలో సేవలందిస్తున్నందున ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని సేవలందించాలన్నారు. జూనియర్ రెడ్క్రాస్, యూత్ రెడ్క్రాస్ విభాగాలు విద్యాసంస్థల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాయని.. సభ్యత్వం తీసుకొని ప్రజాసేవకు సిద్ధంగా ఉండాలని కోరారు.


