పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఊట్కూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అ న్నారు. సోమవారం మండలంలోని పులిమామిడి లో ఆశాబీ, సత్తార్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి ఆయన హాజరై దంపతులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని అమలు చేస్తూ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులు పండించిన సన్నరకం వరి ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతరం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ త్రివేణి చెన్నప్ప, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, నాయకులు సూరయ్యగౌడ్, యజ్ఞేశ్వర్రెడ్డి, నరేష్, గజలప్ప, బాలరాజు, శ్రీను పాల్గొన్నారు.


