● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
మక్తల్: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. ఆదివారం మండలంలోని కాట్రేవ్పల్లి, మంతన్గోడ్ శివారులో కొనసాగుతున్న ఎత్తిపోతల కాల్వ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. పనుల్లో పురోగతి కనిపించాలని, ప్రతి వారం పరిశీలిస్తానని, సమన్వయంతో పని చేయాలని కోరారు. కొడంగల్లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పనులు దగ్గరుండి చేయించాలని ఆదేశించారని చెప్పారు. త్వరలో కోల్పూరు దగ్గర మినీ జూరాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. రైతులు రెండు పంటలు సాగు చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయని వివరించారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, ఏఈఈ నాగశివ, వైస్ చైర్మన్ గణేష్కుమార్, గొల్లపల్లి సర్పంచ్ సూర్యకుమార్, రహీం పటేల్, మహేష్, శంషోద్దీన్, అమరేందర్రెడ్డి, వాకిటి హన్మంతు, గోవర్ధన్, రవికుమార్ ఉన్నారు.
వంతెన పనులు వేగవంతం చేయాలి..
నర్వ: కల్వాల్–సీపూర్ మధ్యన వాగుపై వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి కోరారు. ఆదివారం మధ్యాహ్నం వంతెన నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రూ.6.70 కోట్లతో వంతెన నిర్మాణం చేపడుతున్నామని.. పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రాకముందే పూర్తిచేస్తే రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. రెండు గ్రామాల నాయకులు ముందుండి పనులు పూర్తి చేయించుకోవాలని సూచించారు. ఇది ప్రజా ప్రభుత్వమని.. ప్రజల కోసం నిరంతరం పని చేస్తుందని చెప్పారు. ఇళ్లు లేని అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ఇందిరమ్మ ఇంటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షులు బీసం చెన్నయ్యసాగర్, మక్తల్ అధ్యక్షులు గణేష్, లక్ష్మణ్, మండల నాయకులు కల్వాల్ జగదీశ్వర్రెడ్డి, కల్వాల్, సీపూర్ సర్పంచులు చెన్నయ్య, చంద్రశేఖర్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, అశోక్గౌడ్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.


