మాగనూర్: మక్తల్ నియోజకవర్గ పరిధిలో మరో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మాగనూ ర్ మండలం కొల్పూర్, కర్ణాటక సరిహద్దులోని కొర్తికొండ వద్ద కృష్ణానదిపై రెండు రాష్ట్రాల సహకారంతో రూ. 750కోట్లతో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు శనివారం కర్ణాటక రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి బోసురాజుతో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొల్పూర్ వద్ద కృష్ణానదిపై 8 మీటర్ల ఎత్తులో రూ. 750 కోట్లు వ్యయంతో కృష్ణానదిపై అతి త్వరలో బ్రిడ్జికమ్ బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కర్ణాటక రూ.470 కోట్లు, తెలంగాణ రూ. 280కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. జూరాల ఎగువన కొల్పూర్ వద్ద ప్రాజెక్టు నిర్మించడంతో ఆ ప్రాంత రైతులకు రెండవ పంటకు సాగునీటి కష్టాలు దూరం కావడంతో పాటు మక్తల్ నియోజకవర్గవ్యాప్తంగా రెండు పంటలతో సస్యశ్యామలమయ్యేందుకు మార్గం సుగమవుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అతి త్వరలో ప్రాజెక్టు పనులు ప్రారంభించి.. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
తెలంగాణ, కర్ణాటక సంయుక్తంగా నిర్మించాలని నిర్ణయం
రూ. 750కోట్లు అవసరమని అంచనా
కర్ణాటక మంత్రితో భేటీ అయిన
రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి


