● నేటినుంచి ప్రత్యేక అధికారి పాలనలో జడ్చర్ల పురపాలికం
జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీలో గురువారం నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. పాలకవర్గ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించి వీడ్కోలు పలికారు. 2011 మార్చిలో అప్పటి గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ముగియటంతో ప్రత్యేక అధికారి పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి 2021 వరకు బాదేపల్లి ప్రత్యేక అధికారి పాలనలోనే కొనసాగింది. మధ్యలో జడ్చర్ల మేజర్ గ్రామపంచాయతీకి 2016లో ఎన్నికలు జరిగి ఐదేళ్ల పాటు సర్పంచ్, వార్డుసభ్యుల పాలన కొనసాగింది. బాదేపల్లి మాత్రం మార్చి, 2011 నుంచి మే, 2021 వరకు ప్రత్యేకాధికారి పాలనలోనే ఉండింది. గ్రహణం వీడి 2021 ఏప్రిల్లో ఎన్నికలు జరగగా.. మే 6న పాలక వర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఐదేళ్ల గడువు ముగియటంతో ఇక ప్రత్యేక పాలన అనివార్యమైంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టత కొరవడటంతో అప్పటి వరకు అధికారుల ఆధ్వర్యంలోనే మున్సిపాలిటీలో పాలన కొనసాగనుంది.
ఘనంగా వీడ్కోలు..
పాలకవర్గానికి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి.. చైర్పర్సన్ పుష్పలత, వైస్ చైర్పర్సన్ పాలాది సారికతో పాటు వార్డు కౌన్సిలర్లను సత్కరించి మెమొంటోను అందజేశారు.


