ఊట్కూర్: మండలంలోని పులిమామిడి, బిజ్వార్, అవుసలోనిపల్లి, పగిడిమారి, మల్లెపల్లి తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పులిమామిడిలోని వరి కొనుగోలు కేంద్రంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని విక్రయించేందుకు కేంద్రానికి తీసుకొచ్చి ఆరబోయగా సాయంత్రం వర్షం కురవడంతో తడిసిందని.. నిర్వాహకులు ప్లాస్టిక్ కవర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచకపోవడంతో తడిసినట్లు రైతులు తెలిపారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలనే నిబంధనలున్నా నిర్వాహకులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఊరు చివరన పొలాల్లో కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వివరించారు.


