–8లో u
నారాయణపేట: ఎన్నికల ఖర్చుకు అడిట్ ఉండదనే సాకుతో స్థానిక పురపాలికలో ఏకంగా రూ.79 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతుండటంతో అందరూ పరేషాన్లో పడ్డారు. బిల్లులు సరిగా లేవని చెక్కులు రాయనంటూ అకౌంటెంట్ తేల్చిచెప్పడంతో పుర అధికారులతో కొనసాగుతున్న అంతర్గత కలహం ఆలస్యంగా వెలుగు చూసింది. అకౌంటెంట్ బీరువాకు తాళం వేసుకొని వెళ్లగా.. పగలగొట్టి సరిచేయించడం, అదేరోజు వాట్సప్లో అకౌంటెంట్కు మెమో జారీ కావడంతో పుర అధికార యంత్రాంగంలో ఒకింత చర్చకు దారితీసింది. పుర కార్యాలయం అవినీతి తిమింగళాలకు అడ్డాగా మారిందని అధికారుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనలను తుంగలోతొక్కి ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకోవడమే లక్ష్యంగా కొందరు ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారనే చర్చ సాగుతోంది. పుర ఎన్నికల ముసుగులో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.లక్షల చెక్కులు రాయాలని, లేదంటే అంతు చూస్తామని కిందిస్థాయి సిబ్బందిని బెదిరించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
అడ్వాన్సుల పేరిట దోపిడీ..?
మున్సిపల్ ఎన్నికల ఖర్చు పేరుతో ఓ వార్డు అధికారికి రూ.12 లక్షలు, ఓ అధికారికి రూ.15 లక్షలు, మరో అధికారికి రూ. 5 లక్షలు.. ఇలా రూ.32 లక్షలు డబ్బులు డ్రా చేయించినట్లు సమాచారం. రూ.24 లక్షల చెక్కులు వెంటనే రాయాలని అకౌంట్స్ విభాగం అధికారిపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. బిల్లులు తర్వాత.. ముందు చెక్కులు రాయంటూ సదరు అధికారి హుకూం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదని తెలుస్తోంది.
చెక్కులు మాయం..?
ఈ నెల 18న సాయంత్రం వరకు కార్యాలయంలోనే ఉన్న అకౌంటెంట్ బిల్లులు లేకుండా చెక్కులు రాయడం కుదరదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటికి వెళ్లిన వెంటనే కొందరు అధికారులు సెక్షన్్లోకి చొరబడినట్లు సమాచారం. అధి కారి లేని సమయంలో సెక్షన్న్లోని బీరువాలో ఉన్న చెక్కులను అక్రమంగా తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో సిబ్బంది లేని సమయంలో ఇలాంటి చొరబాట్లు జరగడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని స్పష్టమవుతోంది.
చైర్పర్సన్ రాక ముందే..
పుర చైర్పర్సన్గా ఎన్నికై న కొండ శ్వేత బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె బాధ్యతలు చేపట్టకముందే ఖజనా ఖాళీ చేయాలనుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైర్పర్సన్ వస్తే లెక్కలు చెప్పాల్సి వస్తుందని ముందే భావించిన మున్సిపల్ అధికారులు ఎన్నికల ఖర్చుకు సంబంధించి బిల్లులు డ్రా చేసుకోవాలనుకున్నారా అనేది విచారణ జరిపిస్తే తప్పా అసలు విషయం బయటకు రాదని తెలుస్తోంది.
అధికారులు వర్సెస్ అకౌంటెంట్
మున్సిపల్ ఎన్నికల వ్యయం రూ.79 లక్షలా?
ప్రభుత్వం నుంచి వచ్చింది రూ.20 లక్షలే..
జనరల్ ఫండ్ నుంచి రూ.59 లక్షలుడ్రా చేసేందుకు ప్రయత్నాలు
అకౌంటెంట్కు మెమో జారీ


