9 నామినేషన్లు తిరస్కరణ
● కోస్గిలో 8, మక్తల్లో ఒకటి
నారాయణపేట: జిల్లాలోని నాలుగు పురపాలికల్లో శుక్రవారం వరకు వేసిన అభ్యర్థుల నామినేషన్లను శనివారం ఆర్ఓలు అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. కోస్గి పురపాలికలో 84 మంది 119 నామినేషన్లు వేయగా 8 తిరస్కరణకు గురైనట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. అలాగే మక్తల్ పురపాలికలో ఒక నామినేషన్ను తిరస్కరించినట్లు పుర కమిషనర్ శ్రీరాములు తెలిపారు. 8వ వార్డు ఎస్సీ మహిళలకు కేటాయించగా.. కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బి.రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ నామినేషన్ను తిరస్కరించినట్లు వెల్లడించారు.
● నారాయణపేట మున్సిపాలిటీలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయడంతో ఎవరి నామినేషన్లు తిరస్కరణకు గురికాలేదని పుర కమిషనర్ నర్సయ్య తెలిపారు. మొత్తం 24 వార్డులకు 124 మంది అభ్యర్థులు 202 నామినేషన్లు వేశారన్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు నామినేషన్లు వేయడంతో క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలు జరగలేదని గుర్తించినట్లు వివరించారు. ఇందులో కాంగ్రెస్పార్టీ నుంచి 39, బీజేపీ నుంచి 27, బీఆర్ఎస్ నుంచి 26, ఎంఐఎం నుంచి 4, టీడీపీ నుంచి 2, ఇతరులు 26 మంది నామినేషన్లు ఉన్నట్లు తెలిపారు.
● మద్దూర్ మున్సిపాలిటీలో 16 వార్డులకుగాను 71 మంది అభ్యర్థులు 89 నామినేషన్లు వేశారు. అన్ని నామినేషన్లు సరిగానే ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.


