‘యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి’
నారాయణపేట: ఓటు హక్కు ద్వారా నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి వీలుంటుందని, 18 ఏళ్లు పైబడిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆమె జెండా ఊపి కలెక్టరేట్ వద్ద ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని యువ ఓటర్లు, దివ్యాంగ, సీనియర్ సిటిజన్ ఓటర్లను సన్మానించారు. అనంతరం కళా బృందం ఓటరు చైతన్య గీతాలు ఆలపిస్తుండగా.. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ శాసన్పల్లి రోడ్డు, ఆర్డీఓ కార్యాలయం, పాత బస్టాండ్ మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు చేరుకుంది. విద్యార్థులు చౌరస్తాలో మానవ హారంగా ఏర్పడి ఓటరు చైతన్యం నినాదాలు చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను విద్యార్థులతో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్డీసీ రాజేందర్గౌడ్, ఆర్డీఓ రాంచందర్నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, డీపీఆర్ఓ రషీద్, ఎంఈఓ బాలాజీ, కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


