
నేడు సీఎం రేవంత్ పర్యటన
మహబూబ్నగర్ క్రైం/ అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్ను బుధవారం ఉదయం 11.30 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పరిశ్రమ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కంపెనీ ముందున్న స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి పరిశీలించారు.
అలాగే పరిశ్రమ లోపల జరిగే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. సుమారు 1.45 గంటల పాటు సీఎం ఇక్కడ ఉండనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలీకాప్టర్లో తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమానికి వెళ్లనున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కాగా.. కొత్తగా ఏర్పాటు చేసిన రెండో యూనిట్ ద్వారా మరో 200 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.