
సన్న బియ్యంపై నిఘా
నారాయణపేట
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
మరికల్: ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. దీంతో రేషన్దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఇదే సమయంలో బియ్యం పక్కదారి పట్టకుండా, దొడ్డు బియ్యాన్ని కలపకుండా ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్రమాలకు చోటు లేకుండా ప్రక్షాళన చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల్ని రంగంలోకి దింపింది. జిల్లా వ్యాప్తంగా నిరంతరం ఎక్కడో ఒకచోట రేషన్ బియ్యం పట్టుబడుతునే ఉన్నాయి. కొన్ని రేషన్దుకాణాలు అక్రమాలకు నిలయంగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. గతానికి బిన్నంగా టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను సమాయత్తం చేసి దుకాణాల్లో అక్రమాలకు తెరపడేలా పౌర సరఫరాల అధికార యంత్రాంగం పటిష్ట నిఘా కొనసాగిస్తోంది.
రేషన్ దుకాణాల చుట్టూ వ్యాపారులు
ఇన్నాళ్లు రేషన్ దుకాణాల అడ్డాగా జరిగిన బియ్యం అక్రమ దందాకు సన్నబియ్యం పంపిణీతో అడ్డు పడింది. ఎలాగైన తమ వ్యాపారం కొనసాగించాలనే ఉద్దేశంతో అక్రమ వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా పాత పద్ధతి ప్రకారం రేషన్దుకాణాల వద్దకు వెళ్లి సన్నబియ్యం ఎలా ఉన్నాయి.. వాటిని ఏమైనా అమ్ముతారా అంటూ ఆరా తీస్తున్నారు. దొడ్డు బియ్యం కంటే కిలోకి రూ.5 ఎక్కువగా ఇస్తామంటూ బేరసారాలు ఆడుతున్నారు. ఇదే ఆశతో కొందరు డీలర్లు డబ్బులు కావాలా, లేక బియ్యం కావాలా అంటూ లబ్ధిదారులను రహస్యంగా అడగటం గమనార్హం. కొందరు అక్రమ బియ్యం వ్యాపారులు లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి కిలో రూ.20కి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సివిల్ సప్లయ్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో బియ్యం వ్యాపారుల కదలికపై కన్నేసింది.
బియ్యం బాగున్నాయి
ప్రభుత్వం రేషన్ ద్వారా పంపిణీ చేసిన సన్నబియ్యం బాగున్నాయి. బువ్వ కూడా పొడి, పొడిగా అవుతోంది. గతంలో దొడ్డురకం బియ్యం బువ్వ మంచిగా ఉండేది కాదు. మార్కెట్లో క్వింటాల్ సన్నబియ్యం రూ.5 వేలకు కొనుగోలు చేసేవాళ్లం. ప్రస్తుతం రేషన్లో సన్నబియ్యం పంపిణీ చేయడంతో సంతోషంగా భోజనం చేస్తున్నాం.
– పాపన్న, కిష్టంపల్లి
బేరాలు ఆడుతున్నారు
లావు బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులు సన్నబియ్యం కూడా అమ్ముతారా.. అంటూ ఇటీవల బేరాలు ఆడుతున్నారు. అమ్మేది లేదంటూ చెబుతుండడంతో వెనుదిరుగుతున్నారు. సన్న బియ్యం వండగా.. ఇంట్లో పిల్లలు సైతం బాగుంది అంటున్నారు. అందరి మాదిరిగా తాము కూడా సన్నబువ్వ భోజనం చేయడం ఆనందంగా ఉంది.
– భాగ్యమ్మ, మరికల్
పక్కదారి పడితే చర్యలు
జిల్లాలో మొత్తం రేషన్ దుకాణాలకు 3,382 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందించాం. బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు అందేలా చూస్తాం. కలెక్టర్ ఆదేశాలతో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు రేషన్ దుకాణాలను పర్యవేక్షణ చేయిస్తున్నాం. అక్రమాలకు పాల్పడినా, లబ్ధిదారులకు సరైన సేవలు అందించకపోయినా డీలర్లపై చర్యలు తప్పవు.
– సైదులు,
జిల్లా సివిల్ సప్లయ్ డీఎం, నారాయణపేట
పక్కదారి పట్టకుండా రేషన్
దుకాణాలపై కన్నేసిన ఎన్ఫోర్స్మెంట్
రోజువారి తనిఖీలు, నివేదికలు
సన్నబియ్యంపై ఆసక్తి చూపుతున్న
లబ్ధిదారులు

సన్న బియ్యంపై నిఘా

సన్న బియ్యంపై నిఘా