కర్నూలు (హాస్పిటల్) : గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ చెప్పారు. శనివారం ఇ.తాండ్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుంకేసుల గ్రామంలో నిర్వహిస్తున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి, అందుకు సహకరించిన వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారన్నారు. కూతురు అంటే భారం కాదని, వరమని చెప్పారు. ఆడ అయినా, మగ అయినా ఇద్దరూ ఒకటేనని మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలని సూచించారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, ఇలాంటి వివాహాలు బాలికల జీవితాలపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపిస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మంజూష, సచివాలయ ఆరోగ్య కార్యకర్త లక్ష్మీప్రసన్న, ఆశా కార్యకర్తలు నారాయణమ్మ, జ్యోతి, ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.


