ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు పదేళ్లు దాటితే గోడలకు నెర్రలు కనిపిస్తుంటాయి. అలాంటిది బేతంచెర్ల పట్టణంలో వందేళ్లైనా చెక్కు చెదరని ప్రభుత్వం భవనం ఉంది. పట్టణంలోని అంగళ్ల బజారులో స్వాతంత్య్రానికి మునుపు బ్రిటీష్ హయాంలో కలప, పెంకులతో నిర్మించిన ఈ భవనం 1999 వరకు పోలీస్ స్టేషన్గా కొనసాగింది. తర్వాత తహసీల్దార్ కార్యాలయంగా మార్చారు. 2014లో నూతనంగా నిర్మించిన భవనంలోకి తహసీల్దార్ కార్యాలయం మార్పు చేయడంతో తర్వాత కొంత కాలం పాటు గ్రామ రెవెన్యూ కార్యాలయంగా కొనసాగింది. గత వైఎస్సార్సీపీ హయాంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడంతో 3వ సచివాలయం ఏర్పాటు చేశారు. 2023లో డ్రైవర్స్ కాలనీలో గ్రామ సచివాలయ భవనం నిర్మించడంతో తదనంతరం సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని ఇందులోకి మార్పు చేశారు. కలప, పెంకులతో నిర్మించిన ఈ భవనం వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండటమే గాకుండా ఆవరణలో పెద్ద చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో స్వాగతం పలుకుతూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఠీవీగా నిలుస్తోంది. – బేతంచెర్ల


