నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి మిగులు సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ఐ సొసైటీ డీసీఓ ఎంఈ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ – 2 బాలురకు 180 స్టేట్ ర్యాంకు నుంచి 2893 వరకు, ఎస్సీ – 3 బాలురకు 821 స్టేట్ ర్యాంకు నుంచి 10,152 వరకు, ఎస్టీ బాలురకు 506 నుంచి 6119 వరకు, బీసీ బాలురకు 23 నుంచి 304 వరకు, ఓసీ బాలురకు 86 నుంచి 1023 వరకు ఈ నెల 26వ తేదిన చిన్నటేకూరులో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అలాగే ఎస్సీ – 2 బాలికలకు స్టేట్ ర్యాంకు 593 నుంచి 7014 వరకు, ఎస్సీ –3 బాలికలకు 1038 నుంచి 13,366 వరకు, ఎస్టీ బాలికలకు 2167 నుంచి 10,205 వరకు, బీసీ బాలికలకు 33 నుంచి 609 వరకు, ఓసీ బాలికలకు 80 నుంచి 3063 వరకు ఉన్న వారికి ఈ నెల 27న దిన్నెదేవరపాడులో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుందన్నారు. వివరాలకు 08518– 295601 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
‘మద్దిలేటయ్య’ క్షేత్రం కిటకిట
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు మొక్కుబడుల కార్యక్రమాలు ఉండటంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో క్షేత్రం కిటకిటలాడింది. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో భక్తులకు వసతులు కల్పించారు.
ఇంధన పొదుపునకు సమష్టి ప్రయాణం
నంద్యాల: ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా అధికారులు సమష్టిగా బస్సుల్లో ప్రయాణించి ప్రజలకు అవగాహన కల్పించారు. శనివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు నంద్యాల కలెక్టరేట్లో నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సందేశం ఇచ్చే ముందు అధికారులే ఆచరణలో చూపించాలని, జిల్లా, డివిజనల్, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు తమ తమ వ్యక్తిగత వాహనాలలో కాకుండా, సమష్టిగా మూడు బస్సుల్లో ప్రయాణించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఇకపై ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమం కింద ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అవసరమైన మేరకే ఇంధనాన్ని వినియోగిస్తూ వృథా ఖర్చులను తగ్గించుకునే దిశగా ముందుకు రావాలన్నారు.
ఎంబీబీఎస్ ఫలితాల్లో కేఎంసీ విద్యార్థుల ప్రతిభ
కర్నూలు(హాస్పిటల్): ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాల్లో కర్నూలు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు ప్రతిభ చాటారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 2021–22 బ్యాచ్కు చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఇందులో కర్నూలు మెడికల్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు ఎస్.శషింద్ర 77 పర్సెంట్, సయ్యద్ ఫైజ సుల్తానా 75 పర్సెంట్తో డిస్టింక్షన్ సాధించగా, 135 మంది ఫస్ట్ క్లాస్, 78 మంది సెకండ్ క్లాస్ సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ అభినందించారు.


