కర్నూలు: నూతన చట్టాల ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప్పదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి హెచ్చరించారు. కర్నూలు కోర్టు కాంపౌండ్ ఆవరణలోని న్యాయ సేవా సదన్లో శనివారం బాల్య వివాహ నిరోధక చట్టంపై పురోహితులు, పాస్టర్లు, ప్రభుత్వ ఖాజీలు, ఎన్జీఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎవరైనా బాల్య వివాహాలు చేయాలని మీ దగ్గరకు వస్తే సంబంధిత శాఖలకు కానీ, 15100 లేదా 1098 టోల్ఫ్రీ నంబర్స్కు సమాచారం అందించాలన్నారు. ఐసీడీఎస్ ఆఫీసర్ శారద మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీలు ఉన్నాయని, బాల్య వివాహాలపై వారికి సమాచారమిస్తే వెంటనే ఆ వివాహాన్ని ఆపేస్తారన్నారు. కార్యక్రమంలో కర్నూలు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన తదితరులు పాల్గొన్నారు.


