ప్రేమ పోరాటంలో ఓడిన మోహిత!
ఆళ్లగడ్డ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అహోబిలం గ్రామానికి చెందిన బేరింగుల హరిస్వామి, వెంకటలక్ష్మీల కూతురు మోహిత (30) ఇంటర్ చదువుతున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత పుల్లయ్య ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. నీవు లేకుంటే చచ్చిపోతా.. నీవే సర్వస్వం అంటూ మాయమాటలు చెప్పాడు. చివరకు ఆమె ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో అతను మంచోడు కాదు, అందులోనూ కులాలు వేరని తల్లిదండ్రులు వారించారు. దీంతో ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లపాటు సాఫీగా సాగిన సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఓ సంవత్సరం నుంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన పుల్లయ్య అనుచరుడుగా ఉంటున్న ఓ గిరిజన యువకుడి భార్యపై మోజు పడ్డాడు. ఆమెను అతనికి దూరం చేసి అనధికారికంగా విడాకులు ఇప్పించాడు. ఆమెను హరినగరం గ్రామంలో ఉంచి సహజీవనం చేస్తున్నాడు. అయినా మనసు సంపుకుని సంసారం చేస్తున్న మోహితకు ఈ మధ్య భర్తతోపాటు ఇంట్లో ఉన్న వారి వేధింపులు అధికమవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ మధ్యనే పుట్టింటికి వెళ్లి తన తల్లితో అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు.. నాకు బతకాలని లేదని చెప్పింది. అయితే అతను అధికార పార్టీకి చెందిన వాడు, మనం ఏమీ చేయలేము.. కేసు పెడదామన్నా మన మీదనే దాడి చేస్తారు. ఏదో విధంగా కొన్ని రోజులు సర్దుకుపోమని చెప్పి పంపారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ చూస్తుండగానే విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు నంద్యాల వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది.
అహోబిలంలో ఆత్మహత్య చేసుకున్న
టీడీపీ నాయకుడి భార్య
మోజు తీరాక మరో వివాహితతో
సహజీవనం
ఇద్దరు బిడ్డలతో అవస్థలు
వేధింపులు తాళలేక
పురుగుల మందు తాగి ఆత్మహత్య


